Asia Cup 2025 Final: ఇంత బలుపు అవసరమా.. రన్నరప్ చెక్‌ను విసిరికొట్టిన పాకిస్థాన్ కెప్టెన్

Asia Cup 2025 Final: ఇంత బలుపు అవసరమా.. రన్నరప్ చెక్‌ను విసిరికొట్టిన పాకిస్థాన్ కెప్టెన్

ఆసియా కప్ 2025లో పాకిస్థాన్ టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడినా టీమిండియా అడ్డంకిని అధిగమించలేకపోయింది. ఈ టోర్నీలో పాకిస్థాన్ నాలుగు మ్యాచ్ ల్లో గెలిస్తే మూడు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. ఓడిపోయిన మూడు మ్యాచ్ లు ఇండియా చేతిలోనే కావడం ఆ జట్టును తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. లీగ్ దశలో.. సూపర్-4లో ఘోరంగా ఓడిన పాక్ జట్టు ఫైనల్స్ లో మాత్రం పోటీనిచ్చింది. ఆదివారం (సెప్టెంబర్ 28) దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో చేసింది 146 పరుగులే అయినా చివరి వరకు పోరాడింది. అయితే తిలక్ వర్మను ఆపడంలో పాక్ విఫలమైన పాక్ టైటిల్ దగ్గరకు వచ్చి ఓడిపోయింది. 

టోర్నీలో ఒక జట్టుతో మూడు మ్యాచ్ లు ఓడిపోవడం ఏ జట్టుకైనా బాధ. పైగా భారత జట్టుతో మ్యాచ్ కు ముందు కాలు దువ్విన పాకిస్థాన్ కు ఈ ఓటములు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెజెంటేషన్ లో పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా తన ఓవరాక్షన్ చూపించాడు. రన్నరప్ చెక్కును అందుకుంటున్నప్పుడు ఆఘా ముఖంలో తీవ్ర నిరాశ కనిపించింది. చెక్కు అందజేస్తున్నప్పడు తీసుకొని వెంటనే దానిని విసిరివేయడం షాకింగ్ గా మారింది. ఈ పాక్ కెప్టెన్ ప్రవర్తనతో తీవ్ర విమర్శలు  వస్తున్నాయి. మ్యాచ్ ఓటమి బాధ ఇలా అధికారుల ముందు చూపించకూడదని హిత బోధ చేస్తున్నారు. 

మ్యాచ్ తర్వాత పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా మాట్లాడుతూ తన నిరాశను వ్యక్తం చేశాడు " ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టం. మేము బ్యాట్‌తో ఇన్నింగ్స్ సరిగా ముగించలేకపోయాము. మా బౌలింగ్‌ అద్భుతం. బ్యాటింగ్ లో మేము రాణించగలిగితే ఫలితం ఇంకోలా ఉండేది. మేము మా బ్యాటింగ్‌ను మెరుగుపర్చుకోవాలి. ఓవరాల్ గా జట్టు ప్రదర్శన పట్ల గర్వపడుతున్నాను. ఒక యూనిట్‌గా మేము ఆడిన విధానంతో చాలా సంతృప్తిగా ఉన్నాం". అని ఈ పాక్ కెప్టెన్ మ్యాచ్ ఓటమిపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. 

ALSO READ : ఇంతకు దిగజారుతారా.. ట్రోఫీని వెనక్కి పంపండి

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మన హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ ( 53 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 69 నాటౌట్‌‌‌‌) అపద్బాంధవుడై ఆదుకున్న వేళ ఆదివారం జరిగిన హై ఓల్టేజ్ ఫైనల్లో ఇండియా 5 వికెట్ల తేడాతో పాక్‌‌‌‌ను ఓడించింది.  టాస్ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన పాక్ 19.1 ఓవర్లలో  146 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. ఓపెనర్లు సాహిబ్జదా ఫర్హాన్ (44 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 57), ఫఖర్ జమాన్ (35 బాల్స్‌‌‌‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 46) రాణించగా.. చివరి ఎనిమిది మంది బ్యాటర్లు సింగిల్‌‌‌‌ డిజిట్‌‌‌‌కే పరిమితం అయ్యారు. 

కుల్దీప్ యాదవ్ (4/30), మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (2/30), పొదుపుగా బౌలింగ్ చేసిన అక్షర్ పటేల్ (2/26) ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్‌‌‌‌ను పేకమేడలా కూల్చారు. బుమ్రా (2/25) కూడా రెండు వికెట్లతో మెరిశాడు. అనంతరం తిలక్‌‌‌‌ అద్భుత పోరాటంతో ఇండియా 19.4  ఓవర్లలో 150/5 స్కోరు చేసి గెలిచింది. శివం దూబే (22 బాల్స్‌‌‌‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 33), సంజూ శాంసన్ (24) కూడా రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో ఫహీన్ అష్రాఫ్ మూడు వికెట్లు పడగొట్టాడు. షహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్ తలో వికెట్ తీసుకున్నారు.