విరాట్ కోహ్లీ ఫామ్ లోకి వస్తే పాకిస్తాన్కు తిప్పలు తప్పవని ఆ జట్టు మాజీ ఆటగాడు సల్మాన్ భట్ అన్నాడు. ఆసియా కప్-2022లో భాగంగా ఈ నెల 28న భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈక్రమంలో తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా భట్ మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశాడు. "కోహ్లీ అనుభవం, సామర్థ్యాలేమిటో అందరికీ తెలిసినవే. అతను త్వరగా ఫామ్ లోకి రావాలని టీమిండియా కూడా కోరుకుంటుంది. ఒకవేళ కోహ్లీ ఫామ్ లోకి వస్తే పాక్ జట్టుకు ఇబ్బందులు తప్పవు. జట్టుకు అతను తలనొప్పిగా మారతాడు. గతంలో పాక్ తో మ్యాచ్ ఆడుతూ పలువురు ఆటగాళ్లు ఫామ్లోకి వచ్చిన సందర్భాలు కళ్ల ముందున్నాయి" అని హెచ్చరించాడు.
అటు టీమిండియా అనుసరిస్తున్న రొటేషన్ పాలసీ పై భట్ ప్రశంసలు కురిపించాడు. సీనియర్లకు విశ్రాంతినిస్తూ యువకులతో కీలకమైన సిరీస్ లను ఆడిస్తూ తమ బెంచ్ను టీమిండియా బలంగా తయారు చేసుకుంటుందని అన్నాడు. హెడ్ కోచ్ విషయంలో కూడా రొటేషన్ పాలసీని అవలంభించడం అద్భుత పరిణామమని చెప్పుకొచ్చాడు. కాగా ముగిసిన ఐర్లాండ్ పర్యటనతో పాటు జరగాల్సి ఉన్న జింబాబ్వే టూర్లో హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్కు విరామమిచ్చిన భారత జట్టు.. వీవీఎస్ లక్ష్మణ్కు ఆ బాధ్యతలు అప్పజెప్పింది.
