మామూలు వరిలోకి అడవి జాతి వరి జీన్స్ ప్రవేశపెట్టి సృష్టి
ఉప్పును తట్టుకునే కొత్త రకం వరి వంగడాన్ని ఇండియన్ సైంటిస్టులు సృష్టించారు. పోర్టరీసియా కోవర్క్టాటా అనే అడవి జాతి రకం వరిలోని జీన్స్ను తీసి వాడకంలో ఉన్న ఐఆర్ 64 ఇండికా వరి రకంలోకి ప్రవేశపెట్టి ఈ కొత్త వంగడాన్ని సృష్టించారు. కోల్కతాలోని బోస్ ఇనిస్టిట్యూట్కు చెందిన సైంటిస్టులు ఈ ఘనత సాధించారు. హాలోఫైట్స్ అనే జాతికి చెందిన మొక్కల్లో ఉప్పును తట్టుకునే జీన్స్ ఎక్కువగా ఉంటాయి. అందులో పోర్టరీసియా కోవర్క్టాటా ఒకటి. ఆ మొక్క నుంచి పీసీఐఎన్వో1 అనే జీన్ను తొలిసారి తీశారు. ఆ జీన్ ఉప్పున్నా కూడా ఐనోసిటోల్ అనే విటమిన్ లాంటి పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. అదే మొక్క నుంచి పీసీఐఎంటీ1 అనే జీన్నూ తీశారు సైంటిస్టులు. ఈ రెండో జీన్ ఐనోసిటోల్ను పినిటోల్ అనే మరో కాంపౌండ్గా మారుస్తుంది. ఆ జీన్లతోనే ఐఆర్64 రకంలో మూడు కొత్త వంగడాలను సృష్టించారు.
పీసీఐఎన్వో1ను ఐఆర్64లోకి ప్రవేశపెట్టి ఒకటి, పీసీఐఎంటీ1ను ప్రవేశపెట్టి రెండోది, రెండు జీన్లను పంపి మూడో వంగడాన్ని తయారు చేశారు. వీటన్నింటిలో పీసీఐఎన్వో1ను ప్రవేశపెట్టి సృష్టించిన వంగడమే ఉప్పును ఎక్కువగా తట్టుకుని నిలబడగలిగిందని సైంటిస్టులు చెప్పారు. దాదాపు 200 మైక్రోమోల్స్ లవణీయత ఉన్నా ఆ వంగడాల పెరుగుదల, సామర్థ్యం మెరుగ్గా ఉన్నట్టు చెప్పారు. మిగతా రెండు రకాలూ ఉప్పును అంత ఎక్కువగా తట్టుకోలేకపోతున్నాయని నిర్ధారించారు. పీసీఐఎన్వో1ను ప్రవేశపెట్టిన ఐఆర్64 కొత్త వంగడం నుంచి దిగుబడి ఎక్కువగా వస్తుందని చెబుతున్నారు.