
ఏటూరు నాగారం, వెలుగు: ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షాలతో పాటు పైన ఉన్న ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో భారీగా వరద గోదావరిలోకి వస్తోంది. దీంతో ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకుల గూడెం వద్ద సమ్మక్క బ్యారేజ్ గేట్లను అధికారులు ఓపెన్ చేశారు. ఎగువన శ్రీరామ సాగర్, కడెం, శ్రీపాద ఎల్లంపల్లి, లక్ష్మీబారేజి (మేడిగడ్డ బారేజి) గేట్లు తెరవడంతో పాటు ఇంద్రావతి నది నుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది.
బుధవారం (సెప్టెంబర్ 03) సాయంత్రం సమ్మక్క బ్యారేజ్ 59 గేట్లను పైకి ఎత్తి 8 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్వద్ద నదిలో వరద ఉధృతి గంట గంటకూ పెరుగుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు నీటిమట్టం 14.820 మీటర్లు దాటగా అధికారులు తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్దివాకర టీఎస్ సూచించారు. నీటిమట్టం 15.820 మీటర్లకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే చాన్స్ ఉంది.