T20 World Cup 2024: అమెరికా వద్దంటే విండీస్ రమ్మంది: నేపాల్ జట్టులో సందీప్

T20 World Cup 2024: అమెరికా వద్దంటే విండీస్ రమ్మంది: నేపాల్ జట్టులో సందీప్

టీ20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన నేపాల్ 15 మంది స్క్వాడ్ లో సందీప్ లామిచానేకు చోటు దక్కిన సంగతి తెలిసిందే. అయితే USA వెళ్లేందుకు లామిచానేకు US ఎంబసీ వీసా నిరాకరించింది. రెండుసార్లు ప్రయత్నించినా అమెరికా వీసా నిరాకరించడంతో అతను జట్టుతో పాటు అమెరికా వెళ్ళలేదు. ఇదిలా ఉంటే.. సందీప్ నేపాల్ టీ20 ప్రపంచకప్ జట్టులో చేరనున్నాడు. నేపాల్ తమ చివరి రెండు  మ్యాచ్ లు వెస్టిండీస్ లో ఆడాల్సి ఉంది. అమెరికా వీసా ఇవ్వకపోయినా వెస్టిండీస్ వెళ్లేందుకు సందీప్ కు లైన్ క్లియర్ అయింది. 

అమెరికాలో డల్లాస్‌ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్ లో లామిచానే ఆడలేదు. ఈ మ్యాచ్ తో పాటు శనివారం (జూన్ 15) శ్రీలంకతో ఫ్లోరిడాలో జరగబోయే మ్యాచ్ లోనూ ఆడేందుకు అనుమతి లేదు. అయితే వెస్టిండీస్ గడ్డపై దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌తో జరగనున్న చివరి రెండు గ్రూప్ మ్యాచ్ లకు ఈ యువ స్పిన్నర్ అందుబాటులో ఉంటాడు. సందీప్ లామిచానే ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ కోసం వెస్టిండీస్‌కు వెళ్లి నేపాలీ జాతీయ క్రికెట్ జట్టులో చేరనున్నాడని CAN కార్యదర్శి పరాస్ ఖడ్కా ఒక ప్రకటనలో తెలిపారు.

2022 ఆగస్టులో ఖాట్మండులోని ఓ హోటల్​లో సందీప్‌ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ మైనర్‌ బాలిక పోలీసులకు చేసింది ఫిర్యాదు చేసింది. ఈ కేసు పూర్వపరాలువిచారించిన ఖాట్మండు జిల్లా కోర్టు.. 2024 జనవరిలో అతన్ని దోషిగా తేలుస్తూ 8 ఏళ్లు జైలు శిక్ష విధించింది. అదే తీర్పులో అత్యాచారం జరిగిన సమయానికి బాధిత బాలిక మైనర్ కాదని, ఆమెకు రూ.2,00,000 నష్టపరిహారం చెల్లించాలని, కోర్టుకు రూ.3,00,000 జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

 
దీనిని సవాల్ చేస్తూ లామిచానే పైకోర్టుకు వెళ్లగా.. తీర్పు అతనికి అనుకూలంగా వచ్చింది.  తాజాగా ఈ కేసుపై విచారణ చేపట్టిన జస్టిస్​ సూర్య దర్శన్, దేవ్ భట్టా డివిజన్ బెంచ్.. గతంలో జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. ఈ కేసులో అతన్ని నిర్దోషిగా తేలుస్తూ.. రేప్ కేసు ఆరోపణల నుండి విముక్తి కల్పించింది.