టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్ బాధ్యతలు స్వీకరణ

టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా సంగ్రామ్ సింగ్ బాధ్యతలు స్వీకరణ

టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా ఐపీఎస్ ఆఫీసర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ బస్ భవన్‭లోని తన ఛాంబర్‭లో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ములుగు ఎస్పీగా ఉన్న ఆయనను టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా ప్రభుత్వం ఇటీవల నియమించింది. పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత సంస్థ ఎండీ వీసీ సజ్జనార్, సంగ్రామ్ సింగ్‭ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సంస్థలోకి ఆయనకు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. సంస్థ అభివృద్ధి కోసం మంచి ఐపీఎస్ అధికారిని RTCకి నియమించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సజ్జనర్ కృతజ్ఞతలు తెలియజేశారు. స్వయంగా డాక్టర్ అయిన సంగ్రామ్ సింగ్ సేవలను తార్నాక ఆస్పత్రిలో సౌకర్యాలను మరింతగా మెరుగుపరచడానికి, సిబ్బంది సంక్షేమానికి వినియోగించుకుంటామని సజ్జనార్ తెలిపారు.

పోలీసింగ్ లాగానే ఆర్టీసీ కూడా  ప్రజా సేవే అని సజ్జనార్ గుర్తు చేశారు. ములుగు, భూపాలపల్లి ఎస్పీగా ఉన్నప్పుడు ఆదివాసీలకు సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ చేసిన వైద్య సేవలను మెచ్చుకున్నారు. మేడారం జాతర సమయంలో పోలీస్ శాఖకు టీఎస్ఆర్టీసీ పూర్తిగా సహకరించిందిదని, దాని వల్ల అతి పెద్ద గిరిజన జాతర విజయవంతంగా జరిగిందని గుర్తు చేశారు. త్వరలోనే సంస్థకు ఇంకా మంచి రోజులు రాబోతున్నాయని, సంస్థ వృద్ధికి నిబద్ధతతో పనిచేయాలని సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ కి సూచించారు. టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ ఎస్పీగా తనను నియమించిందుకు ఈ సందర్బంగా ప్రభుత్వానికి సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ కృతజ్ఞతలు తెలియజేశారు. సంస్థ వృద్దికి తన వంతుగా కృషి చేస్తానన్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయనకు ఆర్టీసీ అధికారులు శుభాకాంక్షలు తెలియజేశారు.