మునుగోడు ఎమ్మెల్యే తీరుపై   సొంత పార్టీ సర్పంచ్ గుస్సా

మునుగోడు ఎమ్మెల్యే తీరుపై   సొంత పార్టీ సర్పంచ్ గుస్సా
  • మునుగోడు ఎమ్మెల్యే తీరుపై   సొంత పార్టీ సర్పంచ్ గుస్సా
  • అంబేద్కర్  విగ్రహావిష్కరణకు ఆహ్వానించకపోవడంపై ఆవేదన
  • బడుగు, బలహీన వర్గాలను అవమానిస్తున్నారని ఆరోపణ
  • సంస్థాన్ నారాయణపురంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన

సంస్థాన్ నారాయణపురం వెలుగు:  బడుగు, బలహీన వర్గాల ప్రజాప్రతినిధులను  మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి  అవమానిస్తున్నారని యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం సర్పంచ్ సికిలమెట్ల శ్రీహరి ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ,  బీసీ  లీడర్లపై  ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడన్నారు.  

ఆయన తీరుకు నిరసనగా మండల కేంద్రంలో  శుక్రవారం బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి రోడ్డుపై  ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీహరి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్  బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమానికి దళిత, ఎస్టీ , బీసీ ప్రజాప్రతినిధులను ఆహ్వానించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.  

నిరసనలో దళిత, బీసీ సంఘాల నాయకులు, బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు  తెలంగాణ బిక్షం, మాజీ సర్పంచ్ ఎర్పుల అంజమ్మ, ఉప్పల శ్రీను , లింగస్వామి, వార్డు మెంబర్ బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.