
న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ పార్టీతోనే బడుగు, బలహీన వర్గాల రక్షణ సాధ్యమని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తేనే వెనకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. శుక్రవారం ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్లో పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యతో కలిసి సర్వాయి పాపన్న 373 వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాపన్న ఫొటోకు పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం పొన్నం మాట్లాడుతూ.. అన్ని కులాల వారిని కలుపుకుని సర్వాయి పాపన్న గోల్కొండ కోటను ఆక్రమించారని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో కాంగ్రెస్ కూడా అన్ని వర్గాలను కలుపుకును ముందుకు వెళ్తోందన్నారు. ఉదయ్ పూర్ డిక్లరేషన్ కు అనుగుణంగా బడుగు, బలహీన వర్గాల వారికి పార్టీ పదవుల్లో ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. ఆయన పుట్టిన గ్రామంలోనే తాను పుట్టడం గర్వంగా ఉందని పొన్నాల లక్ష్మయ్య అన్నారు.