- హాజరుకానున్న గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, హెచ్సీయూ వీసీ బీజేరావు
- 161 మందికి గోల్డ్ మెడల్స్, 25 మందికి పీహెచ్డీ పట్టాల అందజేతకు ఏర్పాట్లు
కరీంనగర్, వెలుగు: శాతవాహన యూనివర్సిటీ రెండోసారి కాన్వొకేషన్ కు సిద్ధమవుతోంది. 2018లో మొదటి కాన్వొకేషన్ నిర్వహించగా.. ఈ నెల 7న రెండో కాన్వొకేషన్ నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
యూనివర్సిటీ చాన్స్లర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమక్షంలో జరిగే ఈ కాన్వొకేషన్కు ముఖ్యఅతిథిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ బీజే రావు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా 2018 నుంచి 2025 వరకు పీజీ సబ్జెక్టుల్లో గోల్డ్ మెడల్స్ సాధించిన 161 మందికి గోల్డ్ మెడల్స్, పీహెచ్డీ పూర్తి చేసిన 25 మందికి
డాక్టరేట్ పట్టాలు అందజేయనున్నారు.
ఏర్పాట్లు పూర్తి..
ఈ కాన్వొకేషన్ నిర్వహణకు స్పోర్ట్స్ గ్రౌండ్లో ఏర్పాట్లు పూర్తి కావొచ్చాయి. కాన్వొకేషన్కు వచ్చే గోల్డ్ మెడలిస్టులు, డాక్టరేట్ పట్టా గ్రహీతలు, వారి బంధువులు, యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అంతా కూర్చునేంత భారీ ఆడిటోరియం లేకపోవడంతో గ్రౌండ్లోనే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఈసీ మెంబర్లు, డీన్స్ చేరుకున్నాక 10.20 గంటలకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహిస్తారు.
10.40 గంటలకు హెచ్ సీయూ వీసీ బీజే రావు, 11 గంటలకు గవర్నర్ జిష్టుదేవ్ వర్మ చేరుకుంటారు. 11.25 గంటలకు జాతీయ గీతాలాపన తర్వాత 11.30 గంటల నుంచి పీహెచ్డీ డిగ్రీలు, గోల్డ్ మెడల్స్ ప్రదానం చేయడం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12.40 గంటలకు చీఫ్ గెస్ట్ హెచ్ సీయూ వీసీ బీజే రావు, ఆ తర్వాత 12.50 గంటలకు గవర్నర్ ప్రసగించనున్నారు. అనంతరం కార్యక్రమం ముగియనుంది. గవర్నర్ హాజరవుతుండడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. గోల్డ్మెడల్ అందుకునే విద్యార్థులతోపాటు మరో వ్యక్తికే ప్రవేశం ఉంటుందని, చిన్న పిల్లలకు ఎంట్రీ లేదని వీసీ ఉమేశ్కుమార్ వెల్లడించారు.
రెండు కాన్వొకేషన్లూ నా హయాంలోనే..
2018లో శాతవాహన యూనివర్సిటీ మొదటి కాన్వొకేషన్ నిర్వహించిన సందర్భంలో నేను ఇదే యూనివర్సిటీకి రిజిస్ట్రార్ గా పనిచేశాను. ప్రస్తుతం వీసీ హోదాలో రెండో కాన్వొకేషన్ నిర్వహిస్తుండడం సంతోషంగా ఉంది. నేను వీసీగా బాధ్యతలు చేపట్టాక హుస్నాబాద్ లో ఇంజినీరింగ్ కాలేజీ, క్యాంపస్లో లా కాలేజీ, ఎంఫార్మసీ కోర్సు మంజూరయ్యాయి. క్యాంపస్లో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్తోపాటు సెమినార్ హాల్, ఆడిటోరియం పనులు పూర్తయ్యాయి. ఇటీవల అమెరికా పర్యటనలో విద్యార్థుల గోల్డ్ మెడల్స్ కోసం శాతవాహన ట్రస్ట్ తరఫున రూ.60 లక్షలు విరాళాలు సేకరించాం. నా హయాంలోనే థర్డ్ కాన్వొకేషన్ నిర్వహించడానికి ప్రయత్నిస్తా. ఉమేశ్కుమార్, వీసీ, శాతవాహన యూనివర్సిటీ
