సోకా (జపాన్): ఇండియా బ్యాడ్మింటన్ డ‘బుల్లెట్’, తెలుగు కుర్రాడు సాత్విక్ సాయిరాజ్ తన పార్ట్నర్, ముంబైకి చెందిన చిరాగ్ షెట్టితో కలిసి ఆటలో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే ఎన్నో ఘనతలు సాధించిన సాత్విక్, చిరాగ్ ఇండియన్ బ్యాడ్మింటన్లో అత్యంత విజయవంతమైన జోడీగా పేరు తెచ్చుకున్నారు. వరుస టైటిళ్లు గెలుస్తూ.. ర్యాంక్లోనూ దమ్ము చూపెడుతూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇద్దరిలో చాలా దూకుడుగా ఆడే సాత్విక్ సాయిరాజ్ కొట్టే జంప్ స్మాష్కు ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. అమాంతం గాల్లోకి లేచి బుల్లెట్ స్పీడుతో సాత్విక్ కొట్టే స్మాష్కు తిరుగుండదు. ఆ స్మాష్తోనే సాత్విక్ ఇప్పుడు గిన్నిస్ వరల్డ్ రికార్డు బ్రేక్ చేశాడు. మెన్స్ బ్యాడ్మింటన్ హిస్టరీలో అత్యంత వేగంగా స్మాష్ కొట్టిన షట్లర్గా అతను చరిత్రకెక్కాడు. ఏకంగా గంటకు 565 కిలో మీటర్ల స్పీడుతో స్మాష్ కొట్టి ఔరా అనిపించాడు. దాంతో, 2013లో మలేసియాకు చెందిన టాన్ బూన్ హెయొంగ్ 493 కి.మీ స్పీడ్తో నెలకొల్పి.. పదేండ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న రికార్డును సాత్విక్ బ్రేక్ చేశాడు.
సాత్విక్ కొట్టిన స్మాష్.. ఫార్ములా వన్ కార్ అత్యధిక వేగం 372.6 కిమీ. కంటే చాలా ఎక్కువ. ఇక, మలేసియాకు చెందిన టాన్ పిర్లీ 438 కి.మీ స్పీడుతో ఫాస్టెస్ట్ స్మాష్ కొట్టిన మహిళా షట్లర్గా గిన్నిస్ రికార్డు సృష్టించింది. జపాన్కు చెందిన స్పోర్ట్స్ పరికరాల సంస్థ యోనెక్స్ సాత్విక్, టాన్తో ఈ గిన్నిస్ రికార్డు ప్రయత్నాలను నిర్వహించింది. ఏప్రిల్ 24న జపాన్లోని సోకాలో ఉన్న యోనెక్స్ ఫ్యాక్టరీ జిమ్నాజియంలో నియంత్రిత వాతావరణంలో సాత్విక్ బుల్లెట్ స్మాష్లు కొట్టాడు. నాడు స్పీడో మీటర్లో వచ్చిన రిజల్ట్స్ను గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు తాజాగా ధృవీకరించారు. ఈ విషయాన్ని యోనెక్స్ కంపెనీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ‘యోనెక్స్ బ్యాడ్మింటన్ అథ్లెట్లు సాత్విక్ సాయిరాజ్, టాన్ పెర్లీ ఫాస్టెస్ట్ బ్యాడ్మింటన్ హిట్స్ (స్మాష్)తో కొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డులు నెలకొల్పారని గర్వంగా ప్రకటిస్తున్నాం. ఇది వరకు 2013 మేలో ఫాస్టెస్ట్ బ్యాడ్మింటన్ స్మాష్ కొట్టిన టాన్ బూన్ గిన్నిస్ వరల్డ్ రికార్డు టైటిల్ సాధించాడు. ఒక దశాబ్దానికి పైగా ఉన్న ఆ రికార్డును ఇప్పుడు సాత్విక్ బ్రేక్ చేశాడు’ అని తెలిపింది. ఇటీవల చిరాగ్షెట్టితో కలిసి సాత్విక్ ఇండోనేసియా ఓపెన్ సూపర్ 1000 టోర్నీలో టైటిల్ నెగ్గాడు.
కొరియా ఓపెన్లో బోణీ
కొరియా ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఇండియా మెన్స్ డబుల్స్ టాప్ జోడీ సాత్విక్–చిరాగ్ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మెన్స్ డబుల్స్ తొలి రౌండ్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సాత్విక్–చిరాగ్ 21–16, 21–14తో థాయ్లాండ్కు చెందిన సుపక్ జొంకో–కిటినుపోంగ్ కెడ్రెన్ ద్వయంపై విజయం సాధించింది. అయితే ఇండియాకు చెందిన మరో జోడీ ఎంఆర్ అర్జున్–ధ్రువ్ కపిల తొలి రౌండ్లో తమ మ్యాచ్ను పూర్తి చేయలేకపోయింది. ఎనిమిదో సీడ్ లియు యు చెన్–ఒయు జువాన్ యి (చైనా)తో తొలి గేమ్లో 5–6తో ఉన్న టైమ్లో ధ్రువ్ వెన్నుగాయానికి గురయ్యాడు. దాంతో, ఇండియా జంట మధ్యలో రిటైర్డ్గా వెనుదిరిగింది. మెన్స్ సింగిల్స్లో హర్షిత్ అగర్వాల్, సుష్వంత్ దలాల్ మెయిన్ డ్రాకు అర్హత సాధించలేకపోయాడు. ఇద్దరూ క్వాలిఫికేషన్ తొలి రౌండ్లోనే ఓడిపోయారు. కాగా, ఇండియా టాప్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్ ఈ టోర్నీలో బుధవారం తమ పోరు ఆరంభిస్తారు.