- అత్యధిక క్వార్టర్లీ ప్రాఫిట్
- క్యూ2 లాభం రూ. 13,265 కోట్లు
- నికర వడ్డీ ఆదాయం
- రూ. 35,183 కోట్లు
వెలుగు బిజినెస్ డెస్క్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పనితీరు సెప్టెంబర్ 2022 క్వార్టర్లో అదిరిపోయింది. ఈ క్యూ2లో ఎస్బీఐ లాభం ఏకంగా 74 శాతం పెరిగింది. మునుపెన్నడూ లేనంత క్వార్టర్లీ లాభాన్ని ప్రకటించింది. సెప్టెంబర్ 2022తో ముగిసిన క్వార్టర్లో బ్యాంకుకు రూ. 13,265 కోట్ల నికర లాభం వచ్చింది. అంతకు ముందు ఏడాది క్యూ2 లో ఈ నికర లాభం రూ. 7,627 కోట్లు మాత్రమే. తాజా క్యూ2లో ఎస్బీఐకి రూ. 10,616 కోట్ల లాభం వస్తుందని ఎనలిస్టులు అంచనా వేశారు. ఈ అంచనాలకు మించిన ఫలితాలను ఎస్బీఐ శనివారం ప్రకటించింది. క్యూ2లో ఆపరేటింగ్ ప్రాఫిట్ సైతం 17 శాతం పెరిగి రూ. 21,120 కోట్లకు చేరింది.
నెట్ ఇంటరెస్ట్ ఇన్కం పెరిగింది
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర వడ్డీ ఆదాయం (నెట్ ఇంటరెస్ట్ ఇన్కం) సెప్టెంబర్ 2022 క్వార్టర్లో 12.8 శాతం గ్రోత్తో రూ. 35,183 కోట్లయింది. అంతకు ముందు ఏడాది సెప్టెంబర్ క్వార్టర్లో ఈ నికర వడ్డీ ఆదాయం రూ. 31,184 కోట్లు. నెట్ ఇంటరెస్ట్ మార్జిన్లు కూడా 3.55 శాతానికి పెరిగాయి. కిందటేడాది క్యూ2లో ఇది 3.5 శాతంగా రికార్డయింది. బ్యాంకు ఆర్జించిన మొత్తం వడ్డీ ఆదాయం 15 శాతం పెరిగి రూ. 79,860 కోట్లకు చేరడం విశేషం.
లోన్లు, డిపాజిట్లు
ఎస్బీఐ 20 శాతం క్రెడిట్ గ్రోత్ సాధించింది. దేశంలో ఇచ్చిన అప్పులు 18.15 శాతం గ్రోత్ రికార్డు చేయడం వల్లే ఇది సాధ్యపడిందని బ్యాంకు తెలిపింది. కార్పొరేట్లకు ఇచ్చిన అప్పులే కాకుండా, రిటెయిల్ అప్పులు కూడా బాగా పెరుగుతున్నట్లు బ్యాంకు పేర్కొంది. ఇదే సమయంలో డిపాజిట్లు కూడా 10 శాతం పెరిగినట్లు వివరించింది. కాసా డిపాజిట్లు 5.35 గ్రోత్ సాధించాయని తెలిపింది. గ్రాస్ నాన్పెర్ఫార్మింగ్ అసెట్లు మొత్తం లోన్ బుక్లో 3.52 శాతంగా ఉన్నట్లు ఎస్బీఐ తెలిపింది. అంతకు ముందు ఏడాదిలోని 4.9 శాతంతో పోలిస్తే ఇవి తగ్గాయని పేర్కొంది. ఈ ఏడాది ప్రొవిజన్లు కూడా తగ్గాయని ఎస్బీఐ వెల్లడించింది. ఈ ప్రొవిజన్లు 25.5 శాతం మేర తగ్గినట్లు పేర్కొంది.
లోన్లు భారీగా ఇస్తాం....
ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్లో లోన్లలో రెండంకెల గ్రోత్ అంటే 14–16 శాతం సాధించాలని టార్గెట్గా పెట్టుకున్నట్లు ఎస్బీఐ ఛైర్మన్ దినేష్ ఖారా వెల్లడించారు. తాజా క్వార్టర్ మాకు బిజీ సీజన్. అందుకే ఈ క్వార్టర్లో క్రెడిట్ గ్రోత్ బాగుంది. ఇదే ట్రెండ్ కొనసాగితే తామనుకున్న టార్గెట్లు సాధించగలమనే దీమాను వ్యక్తం చేశారు. జులై–సెప్టెంబర్ క్వార్టర్లీ రిజల్ట్స్ ప్రకటన సందర్భంగా ఆయన శనివారం ముంబైలో మీడియాతో మాట్లాడారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెన్యువబుల్ పవర్, ఆయిల్ అండ్ మార్కెటింగ్ కంపెనీలు, సర్వీసెస్ సెక్టార్లోని కంపెనీల నుంచి అప్పుల కోసం డిమాండ్ పెరుగుతోందని ఖారా చెప్పారు. కొవిడ్–19 సంక్షోభం నుంచి బ్యాంకులు బయటపడుతున్నట్లుగానే కనిపిస్తోందన్నారు.