న్యూఢిల్లీ: కరోనా సమయంలో అల్లోపతి మందులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు తనపై కేసులు వేసిన వారందరినీ ఆ కేసులో ఇంప్లీడ్ చేయాలని యోగా గురు బాబా రామ్ దేవ్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. అల్లోపతిపై తన వ్యాఖ్యల తర్వాత దాఖలైన కేసులన్నింటినీ ఢిల్లీకి బదిలీ చేయాలని కోరుతూ రామ్ దేవ్ వేసిన పిటిషన్పై జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ పీబీ వరాలెతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది.
ఈ కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్స్పై స్టే విధించాలని కోర్టుకు ఆయన విజ్ఞప్తి చేశారు. 2021లో కరోనా మహమ్మారి సమయంలో అల్లోపతి ట్రీట్ మెంట్ కు వ్యతిరేకంగా రామ్ దేవ్ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) బిహార్, చత్తీస్ గఢ్ శాఖలు ఆయనపై కోర్టుకెక్కాయి. వివిధ రాష్ట్రాల్లో పలువురు డాక్టర్లు కూడా ఆయనపై కేసు పెట్టారు. ఈ కేసుల్లో ఊరట పొందాలంటే ఫిర్యాదుదారులందరినీ ఇంప్లీడ్ చేయాలని ఆయనను బెంచ్ ఆదేశించింది. తదుపరి విచారణను జులైకి వాయిదా వేసింది.