ఉన్నత సదువులకీ ఉపకారం

ఉన్నత సదువులకీ ఉపకారం

యూజీ, పీజీ.. కెరీర్​ను నిర్ణయించే కోర్సులు. ఈ దశలో సదువుకోవాలని ఉత్సాహం ఉండి ఆర్థిక పరిస్థితులు అనుకూలించని వారే ఎక్కువ. అటువంటి వారు సైతం ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఉత్తమ మార్గం స్కాలర్​షిప్​లు, ఫెలోషిప్​లు. కోర్సు ఫీజుతో పాటు లివింగ్ ఎక్స్​పెన్సెస్​, బుక్స్​, స్టేషనరీ, ఇతర ఖర్చులకు కంటింజెన్సీ గ్రాంట్​ రూపంలో ఆర్థిక సాయం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూజీ, పీజీ, డాక్టోరల్​ స్టూడెంట్స్​కు అందుబాటులో ఉన్న కేంద్ర ప్రభుత్వం, కార్పొరేట్​  కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న స్కాలర్​షిప్‌‌లు, ఫెలోషిప్​ల వివరాలు మీకోసం..

ఉన్నత విద్యలో సాంప్రదాయ డిగ్రీ కోర్సులు, ప్రొఫెషనల్​ ప్రోగ్రాములు చేస్తున్న వారు, మెరిట్​ సాధించిన వారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం www.scholarships.gov.in లో లభిస్తుంది. కొన్ని పథకాలకు ఎంట్రన్స్​ టెస్టులు రాయాల్సి ఉండగా మరి కొన్నింటికి మెరిట్​ ఆధారంగా ఎంపిక చేస్తారు.

సీఎస్​ఎస్​ఎస్​

గ్రాడ్యుయేట్లకు అందుబాటులో ఉన్న స్కాలర్​షిప్​లలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది సెంట్రల్​ సెక్టార్​ స్కీం ఆఫ్​ స్కాలర్​షిప్​ (CSSS). కుటుంబ ఆదాయం 8 లక్షలలోపు ఉండి మెరిట్​ కలిగిన విద్యార్థులకు రోజవారీ ఖర్చులకు గాను ఆర్థిక సాయం చేస్తారు. దేశవ్యాప్తంగా బాలురకు 41,000, బాలికలకు 41 వేల చొప్పున మొత్తం 82 వేల స్కాలర్​షిప్​లు అందిస్తారు. 18–25 సంవత్సరాల మధ్య ఉండి 12వ తరగతిలో 80 శాతం పైగా మార్కులు సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. డిస్టెన్స్​ లేదా కరస్పాండెంట్ మోడ్​ లో చదివిన వారు అనర్హులు. దీని కింద సంవత్సరానికి పదివేల చొప్పున మొదటి మూడు సంవత్సరాలు (యూజీ), తర్వాతి రెండు సంవత్సరాలు (పీజీ) రూ.20 వేల చొప్పున అందిస్తారు. ప్రతి సంవత్సరం రెన్యూవల్​ చేసుకోవాలి. సైన్స్​, కామర్స్​, హ్యూమానిటీస్​ విభాగాలకు 3:2:1 నిష్పత్తిలో కేటాయిస్తారు. వివరాలకు www.scholarships.gov.in చూడవచ్చు.

నాన్​ హిందీ స్టేట్స్​కు ప్రత్యేకం

హిందీ మాట్లాడని రాష్ట్రాల విద్యార్థులు హిందీ చదివేలా ప్రోత్సహించే స్కాలర్​షిప్ ఇది. స్కీం ఆఫ్​ స్కాలర్​షిప్​ టు స్టుడెంట్స్​ ఫ్రమ్​ నాన్​ హిందీ స్పీకింగ్ స్టేట్స్​ అని పిలిచే ఈ స్కాలర్​షిప్​ ను 11వ తరగతి నుంచి పీహెచ్​డీ వరకు ఇస్తారు. మాతృభాష హిందీ కాకుండా నాన్​ హిందీ స్పీకింగ్ రాష్ర్టాలకు చెంది 10+2+3+2 విధానంలో హిందీ ఒక సబ్జెక్టుగా చదివేవారు అర్హులు. దేశవ్యాప్తంగా మొత్తం 2500 స్కాలర్​షిప్​లు అందుబాటులో ఉన్నాయి. +2 వారికి సంవత్సరానికి రూ.3600, డిగ్రీ విద్యార్థులకు రూ.6000, పీజీ, పీహెచ్​డీ, ఎంఫిల్​ అభ్యర్థులకు పదివేల రూపాయల సాయం చేస్తారు.

ఎస్టీలకు ఎన్​ఎఫ్​ఎస్​హెచ్​ఈ

ఉన్నత చదువుల్లో ఎస్టీ విద్యార్థులకు ఆసరాగా నిలవడానికి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన పథకం నేషనల్​ ఫెలోషిప్ అండ్​ స్కాలర్​షిప్ ఫర్​ హైయర్​ ఎడ్యుకేషన్​ ఫర్​ ఎస్టీ స్టూడెంట్స్​ (ఎన్​ఎఫ్​ఎస్​హెచ్​ఈ‌‌‌‌–ఎస్టీఎస్​). డిగ్రీ, పీజీ విద్యార్థులకు స్కాలర్​షిప్​, ఎంఫిల్​, పీహెచ్​డీ అభ్యర్థులకు ఫెలోషిప్​ ఇస్తారు. ఇందులో ఎంఫిల్​ కు నెలకు రూ.25,000, పీహెచ్​డీ లకు రూ.28,000 అందిస్తారు. దీనికి అదనంగా కంటింజెన్సీ గ్రాంట్​కింద ఎంఫిల్ ​వారికి సంవత్సరానికి రూ.10 వేలు, పీహెచ్​డీ వారికి రూ.20500 ఇస్తారు. యూనివర్శిటీ నిబంధనల ప్రకారం హెచ్​ఆర్​ఏ ఉంటుంది. గ్రాడ్యుయేట్లకు రూ.2.5 లక్షల వరకు ట్యూషన్​ ఫీజు వేవర్‌‌‌‌తో పాటు బుక్స్​కు మూడు వేలు, లివింగ్​ ఎక్స్​పెన్సెస్​కు నెలకు రూ.2200, కంప్యూటర్​ యాక్సెసరీస్​కు ఒకేసారి రూ.45000 సాయం చేస్తారు. కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ.6 లక్షలు దాటకూడదు.

సింగిల్ గర్ల్స్​కు పీజీఐజీఎస్

బాలికలకు ఉన్నత చదువుల్లో ఉచిత విద్యనందించి ప్రోత్సహించేందుకు యూజీసీ ప్రవేశపెట్టిన స్కాలర్​షిప్​ పోస్ట్​ గ్రాడ్యుయేట్​ ఇందిరాగాంధీ స్కాలర్​షిప్​ ఫర్​ సింగిల్​ గర్ల్​ చైల్డ్​ (పీజీఐజీఎస్​–ఎస్​జీసీ). దేశవ్యాప్తంగా మొత్తం 3 వేల స్కాలర్​షిప్‌‌లు అందుబాటులో ఉన్నాయి. 30 సంవత్సరాల లోపు ఉండి రెగ్యులర్​/ఫుల్​టైం పీజీ మొదటి సంవత్సరంలో అడ్మిషన్​ పొంది ఉండాలి. సంవత్సరానికి రూ.36,200 చొప్పున రెండేళ్లపాటు ఇస్తారు.

ఎస్సీలకు టాప్​క్లాస్​ స్కీం

స్కాలర్​షిప్​ స్కీం ఆఫ్ టాప్​ క్లాస్​ ఎడ్యుకేషన్ ఫర్​ ఎస్సీ స్టూడెంట్స్​.. యూజీ, పీజీ చదువుతున్న ఎస్సీ విద్యార్థుల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్‌‌ ను ప్రోత్సహించడానికి సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది. ఐఐఎం, ఐఐటీ, ఐఐఐటీ, ఏఐఐఎంఎస్​, ఎన్​ఐటీ, ఎన్​ఐడీ, ఐహెచ్​ఎం వంటి టాప్ క్లాస్​ ఇన్​స్టిట్యూట్​లలో అడ్మిషన్​ పొంది ఉండాలి. కుటుంబ ఆదాయం సంవత్సరానికి ఆరు లక్షలకు మించకూడదు. ప్రభుత్వ ఇన్​స్టిట్యూషన్లయితే ట్యూషన్ ఫీజు కింద రెండు లక్షలు, ప్రైవేటు ఇన్​స్టిట్యూట్​లలో 3.72 లక్షల వరకు స్కాలర్​షిప్​ అందిస్తారు. లివింగ్​ ఎక్స్​పెన్సెస్​ కింద నెలకు రూ.2220, బుక్స్​ అండ్​ స్టేషనరీ కి రూ.3000, ల్యాప్​టాప్​ ఎయిడ్ ​కింద రూ.45 వేల వరకు సాయం చేస్తారు.

టెక్నికల్​ ఎడ్యుకేషన్​కు ప్రగతి

టెక్నికల్​ ఎడ్యుకేషన్​లో డిగ్రీ, డిప్లొమా చదవాలనుకున్న బాలికలకు ఆర్థిక సాయం అందించేందుకు ఆల్​ ఇండియా కౌన్సిల్​ ఆఫ్​ టెక్నికల్​ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) ప్రవేశపెట్టిన స్కాలర్​షిప్​ ప్రగతి స్కాలర్​షిప్​ స్కీం ఫర్​ గర్ల్స్​. దీని కింద డిప్లొమా వారికి 2 వేలు, డిగ్రీ విద్యార్థులకు రెండు వేల స్కాలర్​షిప్​లు ప్రదానం చేస్తారు. ఇందుకు గాను మెరిట్​ ప్రాతిపదికన విద్యార్థులను సెలెక్ట్​ చేస్తారు. కుటుంబ ఆదాయం 8 లక్షల లోపు ఉండి అడ్మిషన్ పొంది ఉండాలి. ఎంపికయిన వారికి ట్యూషన్​ ఫీజు కింద 30 వేల వరకు, లివింగ్​ ఎక్స్​పెన్సెస్​ కింద నెలకు రూ.2000 చొప్పున పది నెలల పాటు సాయం పొందవచ్చు. వివరాలకు www.aicte-pragati-saksham-gov.in వెబ్​సైట్​ చూడవచ్చు. టెక్నికల్​ ఎడ్యుకేషన్‌‌లో డిగ్రీ, డిప్లొమా చేయాలనుకున్న దివ్యాంగులకు దాదాపు ఇవే నిబంధనలతో సాక్ష్యం స్కాలర్​షిప్​ స్కీం ఫర్​ డిఫరెంట్లీ ఏబుల్డ్​ అనే స్కీం అందుబాటులో ఉంది. దీనిలో డిగ్రీకి 500, డిప్లొమా వారికి ఐదు వందల స్కాలర్​షిప్​లు కేటాయించారు.

యూఆర్​ఎస్​ ఫర్​ మెరిట్​

బీఎస్సీ, బీఏ, బీకాం డిగ్రీల్లో యూనివర్శిటీలో మొదటి, రెండు ర్యాంక్‌‌లు ​సాధించి ఏదైనా పీజీ ప్రోగ్రాములో చేరిన మెరిట్​ విద్యార్థులు దీనికి అర్హులు. లైఫ్​ సైన్సెస్, ఫిజికల్​ సైన్సెస్​, కెమికల్​ సైన్సెస్​, మ్యాథ్స్, ఎర్త్​ సైన్సెస్​, సోషల్​ సైన్సెస్​, కామర్స్​, లాంగ్వేజస్​ విభాగాల్లో రెండేళ్ల పాటు ఏటా రూ.31,000 అందిస్తారు. దీనిని కూడా యూజీసీ ప్రదానం చేస్తుంది.

పీజీఎస్​పీసీ ఫర్​ ఎస్సీ/ఎస్టీ

అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థులు సైతం ఇంజినీరింగ్, టెక్నాలజీ, మేనేజ్​మెంట్​, ఫార్మసీ వంటి ప్రొఫెషనల్​ కోర్సులు చదివేలా ప్రోత్సహించడమే పీజీ స్కాలర్​షిప్​ ఫర్​ ప్రొఫెషనల్​ కోర్సెస్​ ఫర్​ ఎస్సీ/ఎస్టీ (పీజీఎస్​పీసీ–ఎస్సీ/ఎస్టీ) ఉద్ధేశం. యూజీసీ అందించే ఈ స్కాలర్​షిప్​ను దేశవ్యాప్తంగా 1000 మంది ఎస్సీ/ఎస్టీ విద్యార్థుల్లో ఎంఈ/ఎంటెక్ అయితే నెలకు రూ.7500, ఇతర కోర్సులకు రూ.4500 ఆర్థిక సాయంగా పొందవచ్చు.

ఆర్పీఎఫ్​/ఆర్పీఎస్​ఎఫ్​

రైల్వేలో రిటైరైన లేదా ప్రస్తుతం సర్వీస్​లో ఉన్న ఆర్​పీఎఫ్​/ఆర్​పీఎస్​ఎఫ్​ ఉద్యోగుల పిల్లలు, విడోస్​ కు ఉన్నత చదువుల్లో సాయం చేయడానికి ప్రైమ్​ మినిస్టర్స్​ స్కాలర్​షిప్​ స్కీం (పీఎంఎస్ఎస్​) ప్రవేశపెట్టారు. ఆయా రైల్వే జోన్లకు కోటా ఉంటుంది. మొత్తం 150 స్కాలర్​షిప్​లు అందుబాటులో ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వేలో 6, ఈస్ట్​కోస్ట్​ రైల్వేలో 3 స్కాలర్​షిప్‌‌లున్నాయి. 12వ తరగతిలో కనీసం 60 శాతం మార్కులు సాధించి డిగ్రీ, పీజీలో ప్రొఫెషనల్​ కోర్సుల్లో అడ్మిషన్​ పొంది ఉండాలి. పురుషులకు రూ.20 వేలు, మహిళలకు రూ.22500 సాయంగా ఇస్తారు. కోర్సును బట్టి ప్రతి సంవత్సరం రెన్యువల్​ చేసుకుంటూ ఒకటి నుంచి 5 సంవత్సరాల వరకు స్కాలర్​షిప్​ పొందవచ్చు.

 

 

మరికొన్ని..

యూజీ, పీజీ చదువుతున్న దివ్యాంగ విద్యార్థులందరికీ నెలకు రూ.7000 సాయంగా అందించడానికి ప్రవేశపెట్టిన స్కీం స్కాలర్​షిప్​ ఫర్​ టాప్​క్లాస్ ఎడ్యుకేషన్ ఫర్​ స్టూడెంట్స్​ విత్​ డిసెబిలిటీస్​.

బేసిక్​ సైన్సెస్​, ఇంజినీరింగ్, మెడికల్​ కోర్సుల్లో పరిశోధనలు ప్రోత్సహించడానికి ప్రవేశపెట్టిన కిశోర్​ వైజ్ఞానిక్​ ప్రోత్సాహన్​ యోజన (కేవీపీవై)లో డిగ్రీ/ఇంటిగ్రేటెడ్​ పీజీలో మొదటి మూడేళ్లు నెలకు రూ.5000 సాయంగా అందిస్తారు. ఈ సమయంలో రూ.20 వేలు కంటింజెన్సీ గ్రాంట్​ కూడా ఉంటుంది. పీజీ/ఇంటిగ్రేటెడ్​ పీజీలో రెండేళ్లు నెలకు రూ.7000 తో పాటు రూ.28 వేల కంటింజెన్సీ గ్రాంట్​ అందిస్తారు. వివరాలకు: www.kvpy.iisc.ernet.in

నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (NTSE) పరీక్షలో ప్రతిభ కనబర్చిన సైన్స్​, సోషల్​ గ్రూప్​ల వారికి పీహెచ్​డీ, మెడిసిన్​, ఇంజినీరింగ్​ అభ్యర్థులకు పీజీ వరకు ఆర్థిక సహాయం చేస్తారు. యూజీ, పీజీలో అయితే నెలకు రూ.2000, పీహెచ్​డీ అభ్యర్థులకు యూజీసీ నిబంధనల ప్రకారం స్కాలర్​షిప్​లు అందిస్తారు. వివరాలకు: www.ncert.nic.in, www.bse.telangana.gov.in

పైన పేర్కొన్న వాటితో పాటు ఆయా రాష్ర్టాలు ప్రత్యేకంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనారిటీ స్కాలర్‍షిప్‍లను అందిస్తున్నాయి. వాటికి కూడా దాదాపు ఇవే నిబంధనలు వర్తిస్తాయి.