ఏపీ : విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన బాలికలు బరితెగించారు. గుడిలా భావించే బడిలో లోనే బీర్లు తాగారు. ఈ సంఘటన విజయవాడ పరిధిలో శనివారం జరగగా.. ఆలస్యంగా బయటకు వచ్చింది.
వివరాలు ఇలా ఉన్నాయి..విజయవాడ రూరల్ మండలం నిడమానూరు గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లోని ఇద్దరు విద్యార్థినులు శనివారం తరగతి గదిలో మద్యం తాగి, హడావుడి చేశారు. మత్తులో రెచ్చిపోయారు. 9వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు తమ వెంట తెచ్చుకున్న బీర్లను స్కూల్ గదిలోనే తాగారు. తాగిన మైకంలో తోటి విద్యార్థులపై అనుచితంగా ప్రవర్తిస్తూ.. హడావుడి చేశారు.
ఈ విషయాన్ని తోటి విద్యార్థులు స్కూల్ హెడ్ మాస్టర్ కి చెప్పడంతో.. బాలికల తల్లిదండ్రులకు సమాచారమిచ్చాడు. బాలికలు మద్యం తాగారని డాక్టర్లు నిర్ధారించారు. దీంతో బాలికలకు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. వీరి ప్రవర్తన తోటి విద్యార్థులకు కూడా ఇబ్బందికరంగా మారుతుందన్న ఉద్దేశంతో ఇద్దరు విద్యార్థినులకు టీసీలిచ్చి స్కూల్ నుంచి పంపించి వేశారు.