లాక్డౌన్ కారణంగా మూతపడిన స్కూళ్లు జులై 5 తర్వాత తెరవాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది. అది కూడా దశలవారీగా ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మొదట 8 నుంచి 10 తరగతులు ప్రారంభించాలని, ఈ సందర్భంగా లోపాలు బయటపడితే వాటిని సరిచేసిన తర్వాత మిగతా తరగతులను కూడా ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇవాళ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో సమావేశమై అకాడమిక్ ఇయర్ ను ఎప్పుడు ప్రారంభించాలనేదానిపై నిర్ణయం తీసుకోనున్నారు.
మరోవైపు, పాఠశాలల ప్రారంభంపై రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) వ్యూహాపత్రాన్ని రూపొందించింది. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ నిన్ననే దీనిపై విద్యాశాఖ అధికారులతో చర్చించారు. జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) మార్గదర్శకాల తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.