
సుప్రీం కోర్టును కోరిన సెబీ
న్యూఢిల్లీ: అదానీ గ్రూపు స్టాక్ మానిప్యులేషన్కు పాల్పడిందంటూ అమెరికాకు చెందిన షార్ట్సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలపై కొనసాగుతున్న విచారణను ముగించేందుకు మరో 15 రోజులు కావాలని సుప్రీం కోర్టును సెబీ కోరింది. ఈ కేసుకు సంబంధించిన 24 విషయాలను పరిశీలించి, దర్యాప్తు చేసినట్లు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తెలిపింది. వీటిలో 17 పూర్తయ్యాయ్యని, కాంపిటెంట్ అథారిటీ కూడా ఆమోదించిందని తెలిపింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్.. అదానీ గ్రూప్ స్టాక్ ధరల మానిప్యులేషన్ ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తు స్థితి గురించి తెలియజేయాలంటూ సెబీని ఈ ఏడాది జులై 11న ప్రశ్నించింది. ఈ ఏడాది ఆగస్టు 14 నాటికి విచారణను ముగించాలని పేర్కొంది. అప్పటికే అదనంగా గడువు ఇచ్చింది. గౌతమ్ అదానీ కంపెనీల్లో ఎలాంటి అవకతవకలూ జరగలేదని, రెగ్యులేటరీ ఏజెన్సీ వైఫల్యం లేదని సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమిటీ మే నెలలో ఇచ్చిన మధ్యంతర నివేదికలో పేర్కొంది. సెబీ 2014– 2019 రూల్స్లో అనేక మార్పులు తెచ్చిందని, అదానీ గ్రూపుపై వచ్చిన మనీలాండరింగ్ ఆరోపణలపై సెబీ విచారణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంది. అదానీ గ్రూపు మోసపూరిత లావాదేవీలు, షేర్ ధరల మానిప్యులేషన్ వంటి అక్రమాలకు పాల్పడిందని హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలతో అదానీ గ్రూప్ స్టాక్లు తీవ్రంగా నష్టపోయాయి.