నస్పూర్, వెలుగు: రెండో విడత పంచాయతీ ఎన్నికలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జరిగాయని మంచిర్యాల ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళి, కౌంటింగ్ ప్రక్రియను అడిషనల్ ఎన్నికల అధికారి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావుతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలోని బెల్లంపల్లి, భీమిని, కన్నెపల్లి, నెన్నెల, కాసిపేట, తాండూర్, వేమనపల్లి మండలాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించామన్నారు.
పలు పోలింగ్కేంద్రాల పరిశీలన
నెన్నెల మండలం మైలారం, గుండ్ల సోమవారం గ్రామాల్లోని జడ్పీ హైస్కూల్, చిత్తాపూర్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారి సందర్శించి ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియలో అన్ని డిపార్ట్మెంట్ల సిబ్బంది సమన్వయంతో సమర్థంగా విధులు నిర్వహించారని సూచించారు. ఈ నెల 17న జరగనున్న 3వ విడతల ఎన్నికలను అధికారులు ప్రశాంత వాతావరణంలో జరిగేలా కృషి చేయాలన్నారు.
