- ఖమ్మం నుంచి బదిలీపై వెళ్లినా లంచం అడగడం ఆపలే..
ఖమ్మం టౌన్, వెలుగు : ఆమె జీతం రూ.లక్షకుపైనే.. అయినా..రూ. 3వేలకు ఆశపడి ఏసీబీకి చిక్కింది. ఖమ్మం జిల్లా పంచాయతీరాజ్ ఇంజినీర్ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్గా పనిచేసిన బొడ్డు హరిత..ఇటీవలే సూర్యాపేట జిల్లా కోదాడ పీఆర్ డివిజన్ కు సూపరిండెంట్ గా ప్రమోషన్ పై వెళ్లింది. అయితే పెండింగ్ పనులు పూర్తి చేయడం కోసం ఖమ్మం వచ్చిన ఆమె మంగళవారం రూ.3 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ రమేశ్ కథనం ప్రకారం..కాంట్రాక్టర్ కానుమని మల్లికార్జున్ రావు నేలకొండపల్లి మండలం నాచేపల్లిలో 72.5 మీటర్ల సీసీ రోడ్డు వేశారు. ఈ పనులకు సంబంధించి రూ.2 లక్షల 59 వేల బిల్లులను ఆలస్యంగా మంజూరు చేశారు.
వీటికి 2 శాతం కమిషన్ (రూ.3 వేలు) ఇవ్వాలని సీనియర్ అసిస్టెంట్ బొడ్డు హరిత కాంట్రాక్టర్ కు పదే పదే ఫోన్ చేస్తున్నారు. ఈ మధ్యే సూర్యాపేటకు బదిలీ కాగా అక్కడ చార్జ్ తీసుకున్న ఆమె.. ఐదు రోజుల కింద పెండింగ్ పనులున్నాయని వచ్చారు. మళ్లీ మల్లికార్జున్కు ఫోన్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు జడ్పీలోని పంచాయతీ రాజ్ఆఫీసులో రూ.3 వేలు లంచం ఇచ్చేందుకు వచ్చాడు. దీనికి ఆమె.. ఆఫీసులో ఇస్తే అందరూ చూస్తారని, టాయిలెట్వైపు రావాలని కోరారు. అక్కడ లంచం ఇస్తుండగా ఏసీబీ రైడ్ చేసి పట్టుకుంది. సీఐలు బి సునీల్ కుమార్, మహేష్, శేఖర్ పాల్గొన్నారు. బాధితుడు మల్లికార్జున్రావు మాట్లాడుతూ నా బిల్లులు ఇవ్వడంలో లేట్ చేయడమే కాకుండా లంచం కావాలని సతాయిస్తుండడంతో ఏసీబీకి పట్టించానని చెప్పాడు.