ఆఖర్ల పార్టీ మారి ఆగమయిన్రు..!.. ఎలక్షన్లకు ముందు కాంగ్రెస్​ను వీడిన సీనియర్లు

ఆఖర్ల పార్టీ మారి ఆగమయిన్రు..!.. ఎలక్షన్లకు ముందు కాంగ్రెస్​ను వీడిన సీనియర్లు
  • పొన్నాల, సంభాని, నాగం పరిస్థితి అగమ్యగోచరం
  • మళ్లీ సొంతగూటికి వచ్చే యోచనలో పలువురు లీడర్లు

ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలో పదేండ్ల తర్వాత అధికారంలోకి రావడంతో కాంగ్రెస్​ లీడర్లతో పాటు క్యాడర్ ఫుల్​జోష్​లో ఉంది. అయితే, కొందరు మాత్రం తమ పరిస్థితిని తల్చుకుని తల్లడిల్లుతున్నారు. వేర్వేరు కారణాలతో ఎన్నికలకు కొద్దిరోజుల ముందు కాంగ్రెస్​నుంచి బీఆర్ఎస్​లో చేరిన లీడర్ల భవిష్యత్​ అగమ్యగోచరంగా మారింది. ఆశించిన టికెట్ దక్కకపోవడం, ముఖ్య నేతలతో విభేదాలు, ఇలా పలు రకాల కారణాలతో మాజీ పీసీసీ చీఫ్​ దగ్గర నుంచి మొదలుకుంటే కొద్దిమంది మాజీ మంత్రులు పార్టీ మారిన వారిలో ఉన్నారు. మళ్లీ బీఆర్ఎస్​ ప్రభుత్వమే వస్తుందన్న అంచనాలతో ఎన్నికల ముందు తీసుకున్న నిర్ణయం, ఇప్పుడు తలకిందులైంది. ఏఐసీసీ లీడర్ల దగ్గరి నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు బుజ్జగించే ప్రయత్నాలు చేసినా, కచ్చితంగా ఈసారి రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పినా పట్టించుకోలేదు. తీరా కాంగ్రెస్​ పవర్​లోకి రావడంతో వారు ఇప్పుడు బాధపడుతున్నారు. ఎన్నాళ్లో వేచిన ఉదయం వచ్చే సమయానికి తాము ఎటూ కాకుండా పోయామన్న బాధలో ఉన్న ఆ నేతల్లో పలువురు ఇప్పుడు మళ్లీ పాత గూటికి వచ్చే ఆలోచనలో ఉన్నారు.

టికెట్లు రాలేదని..

ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్​గా పనిచేసిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్​కు కాంగ్రెస్​ పార్టీతో నాలుగు దశాబ్దాలకు పైగా అనుబంధముంది. ఇద్దరూ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రులుగా పనిచేశారు. జనగామ టికెట్ దక్కకపోవడంతో పొన్నాల లక్ష్మయ్య, సత్తుపల్లి టికెట్ రాకపోవడంతో సంభాని చంద్రశేఖర్​ బీఆర్ఎస్​లో చేరారు. అక్టోబర్​లో పొన్నాల పార్టీ మారగా, నవంబర్​లో సంభాని బీఆర్ఎస్​లో చేరారు. ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాకు చెందిన మరో సీనియర్​నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్​ రెడ్డి పరిస్థితి కూడా దాదాపు ఇంతే. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పిన నాగం, తర్వాత పరిణామాలతో బీజేపీలో చేరారు. మొదటి నుంచి టీఆర్ఎస్​కు వ్యతిరేకంగా పనిచేసిన నాగం, బీజేపీ నుంచి నాలుగేండ్ల కింద కాంగ్రెస్​ గూటికి చేరారు. ఆశించిన నాగర్ కర్నూల్​ టికెట్ దక్కకపోవడంతో ఎన్నికలకు ముందు బీఆర్ఎస్​లో చేరారు. మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, ఊకే అబ్బయ్య, ఎర్ర శేఖర్, కాంగ్రెస్​ లీడర్లు మానవతారాయ్​ తదితరులు ఎలక్షన్లకు కొద్దిరోజుల ముందే కాంగ్రెస్​ ను వీడారు. వీళ్లలో కొద్ది మంది మళ్లీ సొంత గూటికి వచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. భావోద్వేగ పరిస్థితుల్లో కాంగ్రెస్​ను వీడి తప్పు చేశామని కార్యకర్తలు, సన్నిహితులతో కామెంట్ చేస్తున్నట్టు సమాచారం. ఎన్నికలకు ముందు పీసీసీ చీఫ్ ​రేవంత్ సహా సీనియర్లు బుజ్జగించినా వినకుండా, కాంగ్రెస్​పై తీవ్ర విమర్శలు చేసిన ఒకరిద్దరు మాత్రం కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు సమాచారం. మరీ తొందరపడినట్టు కాకుండా కొద్దిరోజుల తర్వాత కాంగ్రెస్​ లో చేరాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, కార్యకర్తలు మాత్రం ఎలక్షన్ల ముందు కాంగ్రెస్​ను వీడి తప్పుచేశారంటూ ఆయా నేతలతో కామెంట్​ చేస్తున్నట్టు సమాచారం.