ముంబై: బెంచ్మార్క్ ఇండెక్స్లు వరుసగా ఐదో సెషన్లోనూ లాభాల్లో కదిలాయి. గురువారం సెషన్ను నష్టాల్లో ఓపెన్ చేసిన సెన్సెక్స్, నిఫ్టీ..వడ్డీ రేట్లను మార్చడం లేదని ఆర్బీఐ ప్రకటించడంతో లాభాల్లోకి మారాయి. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ కీలక లెవెల్ అయిన 41,200 ను ఈజీగా దాటేసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో సెన్సెక్స్ 144 పాయింట్లు (0.24%) లాభపడి 59,833 వద్ద సెటిలయ్యింది. నిఫ్టీ 42 పాయింట్లు పెరిగి 17,599 వద్ద క్లోజయ్యింది. ‘ఆర్బీఐ రేట్ల పెంపును ఆపడం క్లిష్టమైన పిచ్లో సచిన్ బ్యాటింగ్ చేయడం లాంటిది.
బాల్పై ఫోకస్ పెట్టి, నచ్చినప్పుడు హిట్టింగ్ ఆడే వీలుంటుంది. రేట్లను పెంచడానికి, ఆపడానికి ఆర్బీఐకి అవకాశం ఉంది. రేట్ల పెంపును ఆపడం పూర్తిగా ఊహించనది కాదు’ అని కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఎండీ నిలేష్ షా అన్నారు. పరిస్థితులను గమనించి, డేటాను విశ్లేషించి తర్వాత ఏం చేయాలో ఆర్బీఐ నిర్ణయిస్తుందని చెప్పారు. వడ్డీ రేట్ల పెంపును ఆపి ఆర్బీఐ అందరినీ ఆశ్చర్యపరిచిందని స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా అన్నారు. కానీ, ఇది పూర్తిగా ఊహించనది కాదని చెప్పారు. తాజా నిర్ణయంతో మిగిలిన దేశాల సెంట్రల్ బ్యాంకుల కంటే మనం ముందుంటామని అభిప్రాయపడ్డారు. మార్కెట్ సానుకూలంగా ఉంది. ఈ పాలసీ మరింత ఆనందం నింపింది.
అయినప్పటికీ కనిష్టాల నుంచి రికవరీ అవ్వడం, లాంగ్ వీకెండ్, వీక్లీ ఎక్స్పైరీ ఉండడంతో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగొచ్చని లేదా కన్సాలిడేషన్ కనిపించొచ్చని సంతోష్ మీనా వెల్లడించారు. సియోల్, జపాన్, షాంఘై మార్కెట్లు నష్టాల్లో క్లోజవ్వగా, హాంకాంగ్ లాభాల్లో ముగిసింది. డాలర్ మారకంలో రూపాయి విలువ 81.92 వద్ద సెటిలయ్యింది.