- గత నెలన్నరలో 6,500 పాయింట్లు పడిన సెన్సెక్స్
- మార్కెట్ పతనం ఆగలేదంటున్న ఎనలిస్టులు
బిజినెస్ డెస్క్, వెలుగు: దేశ స్టాక్ మార్కెట్లు గత నెలన్నరలో నష్టపోయింది రూ. 33 లక్షల కోట్లు. అదే గ్లోబల్ మార్కెట్లు నష్టపోయింది అక్షరాల రూ. 847 లక్షల కోట్లు. అన్నిటికన్నా ఆందోళన పడాల్సిన విషయం ఏంటంటే ఇంకా మార్కెట్ల పతనం ఆగకపోవడం. ఇన్ఫ్లేషన్ ఇప్పటిలో తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. యూఎస్ ఫెడ్తో సహా అభివృద్ధి చెందిన దేశాలు కీలక వడ్డీ రేట్లను పెంచుతుండడం మనలాంటి ఎమెర్జింగ్ మార్కెట్లపై నెగెటివ్ ప్రభావం చూపుతున్నాయి. ఆర్బీఐ కూడా రెపో రేటును పెంచడం స్టార్ట్ చేసింది. ఈ నెల 4 న జరిగిన అన్షెడ్యూల్డ్ మీటింగ్లో 40 బేసిస్ పాయింట్లు పెంచింది కూడా. మరోవైపు దేశంలో ఇన్ఫ్లేషన్ పెరుగుతూనే ఉంది. ఏప్రిల్ సీపీఐ డేటా ఏకంగా ఎనిమిదేళ్ల గరిష్టమైన 7.79 శాతానికి పెరిగింది. అంటే ఇన్ఫ్లేషన్ను కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ ఇంకా రేట్లు పెంచుతుందని అంచనావేయొచ్చు. రానున్న జూన్, ఆగస్ట్ ఎంపీసీ మీటింగ్లలో కలిపి రెపో రేటును 75 బేసిస్ పాయింట్లు పెంచినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ఎస్బీఐ రిపోర్ట్ వెల్లడించడం గమనించాలి. ముఖ్యంగా ఫెడ్ రేట్ల పెంపు ఇండియా లాంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లను కలవర పెడుతోంది. ఇక నుంచి జరిగే ప్రతీ ఫెడ్ మీటింగ్లో వడ్డీ రేట్లను కనీసం 50 బేసిస్ పాయింట్లు పెంచుతారని అంచనాలు ఉన్నాయి. ఇదే జరిగితే దేశ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్ట్మెంట్లు మరింత వెళ్లిపోతాయి. ప్రస్తుతం మార్కెట్లు భారీగా పడడానికి ఇదొక కారణం. ఆర్బీఐ రేట్లు పెంచితే ఫైనాన్షియల్ సంస్థల నుంచి అప్పులు తీసుకోవడం ఖరీదుగా మారుతుంది. ఎకానమీ గ్రోత్ స్లో అవుతుంది. ఇంకా వ్యవస్థలో లిక్విడిటీ తగ్గిపోతే షేర్లు వంటి రిస్క్ ఎక్కువగా ఉన్న మార్కెట్లలో ఇన్వెస్టర్లు డబ్బులు పెట్టడం తగ్గుతుంది. మరోవైపు రష్యా–ఉక్రెయిన్ సంక్షోభం వలన గ్లోబల్గా క్రూడాయిల్ రేట్లు పెరుగుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్పై ఎక్కువగా ఆధారపడే ఇండియా లాంటి దేశాలకు ఇది ఆందోళన కలిగించే అంశం.దేశంలో ఫ్యూయల్ రేట్లు పెరగడానికి, ఇన్ఫ్లేషన్ ఎక్కువవ్వడానికి గ్లోబల్గా క్రూడ్ రేట్లు పెరగడంఒక కారణం. ఇంకా రష్యా స్టీల్ వంటి మెటల్స్ను ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసే దేశం. రష్యా–ఉక్రెయిన్ సంక్షోభంతో గ్లోబల్గా రాగి, స్టీల్, అల్యూమినియం వంటి రామెటీరియల్స్ రేట్లు ఎక్కువవుతున్నాయి. ఇది కూడా మార్కెట్లను కలవరపరుస్తోంది.
ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లు పెరిగే అవకాశం కంటే పడే ఛాన్స్లే ఎక్కువగా ఉన్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు. మార్కెట్లు నష్టపోతున్నప్పటికీ, లాభపడుతున్న షేర్లను గుర్తించాలని, వాటిలోనే ఇన్వెస్ట్ చేయాలని అన్నారు. పడుతున్న షేర్లను వదిలించుకోవాలని పేర్కొన్నారు. ఫండమెంటల్గా వాల్యూ ఉంటుందని అనుకునే షేర్లను మాత్రం నష్టపోతున్న పోర్టుఫోలియోలోనూ కొనసాగింతీచాలని సలహాయిచ్చారు.
అమాంతం పెరిగి పడింది..
బ్యాంక్, ఫైనాన్షియల్ షేర్లు పెరగడంతో సెన్సెక్స్, నిఫ్టీలు సోమవారం ఓపెనింగ్ సెషన్లో భారీగా పెరిగాయి. కానీ, ఆ లెవెల్ నుంచి కిందకి పడ్డాయి. అయినప్పటికీ వరస ఏడు సెషన్ల నష్టాల తర్వాత మొదటిసారిగా ఇండెక్స్లు సోమవారం లాభాల్లో ముగియగలి గాయి. ఒకానొక దశలో 635 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ చివరికి 180 పాయింట్ల (0.34 %) లాభంతో 52,974 వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 60 పాయింట్లు (0.38 %) పెరిగి 15,842 వద్ద ముగిసింది. సెన్సెక్స్లో ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి.