
టెన్నిస్ లెజెండ్ సెరెనా విలియమ్స్ మరోసారి ఓటమిపాలైంది. సిన్సినాటి మాస్టర్స్ తొలి రౌండ్ లోనే ఆమె ఇంటిముఖం పట్టింది. యూఎస్ ఓపెన్ ఛాంపియన్ ఎమ్మా రదుకాను చేతిలో 4-6,0-6 స్కోరు తేడాతో సెరీనో ఓడిపోయింది. ఫస్ట్ సెట్లో 19 ఏళ్ల ఎమ్మాపై కాస్త పోరాడిన సెరెనా..రెండో సెట్లో పూర్తిగా చేతులెత్తేసింది.
దారుణ ఓటమి
కెనడా మాస్టర్స్లో ప్రీక్వార్టర్ ఫైనల్స్లోనే సెరెనా నిష్క్రమించింది. విమెన్స్ సింగిల్స్ రెండో రౌండ్లోనే ఆమె ఇంటిదారి పట్టింది. 2–6, 4–6తో వరుస సెట్లలో బెలిందా బెన్సిచ్ (స్విట్జర్లాండ్) చేతిలో పరాజయం పాలైంది. జూన్ లో జరిగిన వింబుల్డన్-2022 టోర్నీలోనూ సెరెనా విలియమ్స్కు చుక్కెదురైంది. ఈ టోర్నీ తొలి రౌండ్ పోటీల్లో ఓటమి చవిచూసింది. ఏడుసార్లు చాంపియన్గా నెగ్గిన సెరెనా ఫ్రాన్స్కు చెందిన వరల్డ్ నెంబర్ 115 క్రీడాకారిణి హర్మోనీ టాన్ చేతిలో పరాజయం పాలైంది. ఈ టోర్నీలో ఓటమి తర్వాతే సెరెనా టెన్నిస్ కు రిటైర్మెంట్ ప్రకటించింది. వరుస ఓటముల నేపథ్యంలో ఈనెలాఖరులో ప్రారంభమయ్యే యూఎస్ ఓపెన్లో సెరెనా ఏవిధంగా ఆడుతుందో చూడాలి.
మెద్వెదెవ్ ముందంజ..
సిన్సినాటి ఓపెన్లో ఒసాక (జపాన్) 4-6, 5-7తో షువాయి జంగ్ (చైనా) చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. కోకో గాఫ్ (అమెరికా) గాయం కారణంగా మ్యాచ్ మధ్యలో తప్పుకుంది. ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 7-5, 6-1తో వీనస్ విలియమ్స్ (అమెరికా)పై గెలిచింది. మెన్స్ సింగిల్స్లో మెద్వెదెవ్ (రష్యా) మూడో రౌండ్లో అడుగుపెట్టాడు. వరల్డ్ నెం.1 ప్లేయర్ రెండో రౌండ్లో 6-4, 7-5తో బోటిచ్ (నెదర్లాండ్స్)పై గెలిచాడు.