రూ. వెయ్యికే వ్యాక్సిన్

రూ. వెయ్యికే వ్యాక్సిన్

ముందు మనకు, ఆ తర్వాతే విదేశాలకు
ఈ ఏడాది 6 కోట్ల వ్యాక్సిన్ డోసులు
ట్రయల్స్ సక్సెస్ అయితే వచ్చే ఏడాది 40 కోట్ల డోసులు
-సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ తయారీలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా బిజీ అయిపోతోంది. ట్రయల్స్ న‌డుస్తున్నా రిస్క్ చేసి వాటి ప్రొడక్షన్ ను మొదలు పెట్టేస్తోంది. అంతేకాదు, దాని ధర కూడా ఫిక్స్ చేసేసింది. వెయ్యి రూపాయలకే ఒక్కో డోసును అమ్ముతామని వెల్లడించింది. అవసరమైతే జనాలకు సర్కార్ ఫ్రీగా కూడా ఇవ్వొచ్చని చెప్పింది. అంతేకాదు, ముందు దేశ అవసరాలు తీరాకే విదేశాలకు ఎగుమతి చేస్తామని హామీ ఇచ్చింది. వ్యాక్సిన్ల త‌యారీ, దానికి సంబంధించిన వివరాలను కంపెనీ సీఈవో అదర్ పూనావాలా వివరించారు. ఆక్స్ ఫ‌ర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులు ‘చేడాక్స్ ‌1 ఎన్ కొవ్ 19’ అనే వ్యాక్సిన్ ట్రయల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ట్రయల్స్ కచ్చితంగా సక్సెస్ అవుతాయని గట్టిగా నమ్ముతున్న సైంటిస్టులు, సెప్టెంబర్ నాటి కి దానిని అందుబాటులోకి తేవాలన్న పట్టుదలతో ఉన్నారు. వ్యాక్సిన్ల త‌యారీకి సీరమ్ తో పాటు మరో 6 కంపెనీలతో వర్సిటీ ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగానే సీరమ్ ప్రొడక్షన్ ను మెదలుపెట్టబోతోంది.

ఈ ఏడాది 6 కోట్ల డోసులు

ఈ ఏడాది 6 కోట్ల వ్యాక్సిన్ డోసులను తయారు చేస్తామని అదర్ పూనావాలా చెప్పారు. ట్రయల్స్ సక్సెస్ అయి అంతా అనుకున్నట్టే జరిగితే వచ్చే ఏడాది 40 కోట్లకు పెంచుతామన్నారు. జంతువులపై వ్యాక్సిన్ సక్సెస్ అయిందని, మనుషులపైనా అది సక్సెస్ అవుతుందని నమ్మకంగా చెప్పారు. ‘‘ఆక్స్ ఫ‌ర్డ్ లో గొప్ప గొప్ప సైంటిస్టులున్నారు. వాళ్లకు ఎంతో అనుభవం ఉంది. మాకు వ్యాక్సిన్ సక్సెస్ పై నమ్మకం ఉంది. అందుకే రిస్క్ అయినా ప్రొడక్షన్ ను స్టార్ట్ చేస్తున్నాం’’ అని ఆయన అన్నారు. వ్యాక్సిన్ ఇంకా ట్రయల్స్ దశలోనే ఉన్నా రిస్క్ చేసి ఉత్పత్తి ప్రారంభిస్తున్నామన్నారు . దాని కోసం వేరే ప్రొడక్టులు, ప్రాజెక్టులను
పక్కన బెట్టామని చెప్పారు. పుణేలోని రెండు ప్లాంట్లలో వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తామన్నారు.

వ్యాక్సిన్ తయారీ వేగం పెంచండి: WHO

కరోనా వ్యాక్సిన్ తయారీలో వేగం పెంచాలని, వీలైనతంత తొందరగా దానిని అందుబాటులోకి తేవాలని ఇండియా సహా సౌత్ఈస్ట్ఆసియా దేశాలను ప్రపంచఆరోగ్య సంస్థ(WHO ) కోరింది. బుధవారం ఇండియా, ఇండొనేసియా, థాయ్లాండ్లోని ప్రముఖ వ్యాక్సిన్ తయారీ కంపెనీలు, ఆయాదేశాల రెగ్యులేటరీ సంస్థలతో WHO సౌత్ఈస్ట్ఏసియా రీజనల్ డైరెక్ట‌ర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. వ్యాక్సిన్ తయారీకి సౌత్ ఈస్ట్ఏషియా పవర్ హౌస్ అని, ఇప్పుడు కరోనా మహమ్మారి పోరులో వ్యాక్సిన్ల త‌యారీలోనూ ముందుండాలని ఆమె కోరారు. వ్యాక్సిన్ ప్రీ క్లినికల్ ట్రయల్స్, క్లినిక్లికల్ ట్రయల్స్, ఉత్పత్తి, లైసెన్సింగ్, మార్కెటింగ్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరముందన్నారు.

సర్కార్ ఫ్రీగా ఇవ్వొచ్చు

వ్యాక్సిన్ ధ‌రను రూ.వెయ్యిగా నిర్ణయించామని అదర్ చెప్పారు. అయితే, జనానికి సర్కార్ ఉచితంగా టీకాను ఇవ్వొచ్చని అన్నారు.ప్రధాని నరేంద్రమోడీ ఆఫీస్ వ్యాక్సిన్ త‌యారీని క్లోజ్ గా పరిశీలిస్తోందనిచెప్పారు. వ్యాక్సిన్ త‌యారీ ఖర్చుకు ప్రభుత్వం నుంచి సాయం అందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఐదు నెలల్లోవ్యాక్సిన్ త‌యారీకి నెలకు రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్టు చెప్పారు. నెలకు 30లక్షల నుంచి 50లక్షల డోసులను తయారు చేస్తామన్నారు. వ్యాక్సిన్లను ముందుగా దేశప్రజలకు అందుబాటులో ఉంచుతామని, ఆ తర్వాతే విదేశాలకు ఎగుమతి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఏయే దేశాలకు ఎప్పుడు వ్యాక్సిన్ ను ఎగుమతి చేయాలన్న విషయాన్ని కేంద్ర సర్కార్క్ కే వదిలేశామన్నారు. కేవలం కరోనా వ్యాక్సిన్ తయారీకే రూ.600 కోట్లతో ప్రత్యేకమైన యూనిట్ ను ఏర్పాటు చేస్తామనిఅదర్ తెలిపారు.