బిల్డర్ ఇష్టారాజ్యం.. ‘డ్రైనేజీ’ అంచు వరకు తవ్వకం

బిల్డర్ ఇష్టారాజ్యం.. ‘డ్రైనేజీ’ అంచు వరకు తవ్వకం
  • పైప్​లైన్​కు క్రాక్​ ఏర్పడి భారీగా లీకవుతున్న మురుగునీరు
  • అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికుల ఆరోపణ

గండిపేట, వెలుగు: ఓ బిల్డర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నిబంధనలకు పాతరేశాడు. సెల్లార్​ కోసం డ్రైనేజీ పైపులైన్ అంచు వరకు తవ్వించాడు. ఫలితంగా మురుగునీరు పెద్ద ఎత్తున లీకవుతూ చెరువును తలిపస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. బండ్లగూడ కట్ట మైసమ్మ ఎదుట ఓ బిల్డర్ హైరైజ్ బిల్డింగ్ నిర్మిస్తున్నాడు. దాని పక్క నుంచే ప్రెస్టేజ్ విల్లాస్ నుంచి ప్రారంభమై రాక్ చర్చి నుంచి ఓంనగర్, సరస్వతి, రాత్రి, శ్రీనివాసం ఏంక్లేవ్ తదితర 20 కాలనీల నుంచి డ్రైనేజీ పైప్​లైన్​ఉంది. మురుగునీరు మూసీనదిలో కలిసేలా దీన్ని కొన్నేండ్ల క్రితం వేశారు. 

అయితే కొన్ని రోజులుగా బిల్డింగ్ పనులు చేయిస్తున్న బిల్డర్​సెల్లార్​కోసం నిబంధనలకు విరుద్ధంగా ఆ పైపులైన్​అంచు వరకు తవ్వించాడు. దీంతో బ్యాలెన్స్​తప్పి, పైప్​లైన్​మధ్యలో క్రాక్ ఏర్పడి డ్రైనేజీ నీరు భారీగా లీకవుతోంది. పైప్​లైన్​కింది నుంచి కూడా మట్టి తీశారని స్థానికులు అంటున్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాల్సిన మున్సిపల్, ఇంజనీరింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి బిల్డర్​పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.