
నాగ్పూర్: ఓట్ల చోరీ జరిగిందని కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ సమర్థించారు. రాహుల్ ఆరోపణలపై ఎన్నికల సంఘం (ఈసీ) విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం నాగ్ పూర్లో మీడియాతో పవార్ మాట్లాడారు. రాహుల్ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి ఈసీ తన నిజాయితీ నిరూపించుకోవాలని, ప్రజల సందేహాలను నివృత్తి చేయాలని ఆయన కోరారు.
‘‘ఈసీ ఒక స్వతంత్ర సంస్థ. కర్నాటక, మహారాష్ట్రలో ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ చేసిన ఆరోపణలపై డిక్లరేషన్ అడగడం కరెక్టు కాదు. ఓట్ల చోరీ జరిగిందని పార్లమెంటులో కూడా ఆయన అన్నారు. ఆయన వ్యాఖ్యలను కొట్టిపారేయకూడదు. ఈ వ్యవహారంపై సమగ్రంగా దర్యాప్తు జరిపి ఈసీ తన గౌరవాన్ని కాపాడుకోవాలి” అని పవార్ వ్యాఖ్యానించారు.