
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విందు ఇవ్వడంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్రంగా విమర్శించారు. 2001లో అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్పై ఆల్ఖైదా టెర్రరిస్టు ఒసామా బిన్ లాడెన్ దాడి చేసి, 3 వేల మంది అమాయకుల చావుకు కారణమైన విషయాన్ని మర్చిపోకూడదని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
‘‘పాక్ ప్రతినిధి బృందాన్ని కలిసిన కొంత మంది అమెరికా సెనేటర్లు, కాంగ్రెస్ సభ్యులు 9/11 దాడిని మర్చిపోయినట్లు ఉన్నారు. కానీ, అమెరికాలోని ప్రజలు ఒసామా ఎపిసోడ్ను అంత త్వరగా మర్చిపోలేరు. పాక్ ఆర్మీ క్యాంప్లో లాడెన్ను దాచిపెట్టిన విషయాన్ని అమెరికన్లు క్షమించరు. అమెరికాలో అత్యంత దారుణమైన ఉగ్రదాడికి కారణమైన వ్యక్తికి పాక్ ఆశ్రయం కల్పించింది”అని ఆయన పేర్కొన్నారు.
ఈ భేటీలో టెర్రరిస్టులకు ఆర్థిక సహాయం, ఆయుధాలు, శిక్షణ, భారత్పై దాడులకు పంపడం వంటివి చేయొద్దని పాక్ ఆర్మీ చీఫ్కు ట్రంప్ చెప్పి ఉంటారని అన్నారు.
పార్టీలో కొందరితో భిన్నాభిప్రాయాలు..
కొన్ని అంశాలపై కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వంలోని కొందరితో భిన్నాభిప్రాయలు ఉన్నాయని ఎంపీ శశి థరూర్ తెలిపారు. అయితే, వీటి గురించి పార్టీ అంతర్గత సమావేశాల్లోనే చర్చిస్తానని వెల్లడించారు. ప్రస్తుతం వాటి గురించి చర్చించడానికి తనకు ఎలాంటి కారణం కనిపించడం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో విభేదాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయన్న మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.