భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు

భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు

దేశంలోని శైవక్షేత్రాల్లో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మహాశివుడికి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. వేకువ జాము నుంచే ప్రఖ్యాత శివాలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని పూజలు చేస్తున్నారు. నాసిక్ లోని జ్యోతిర్లింగ క్షేత్రానికి ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అటు ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లోని ప్రాచీన శివాలయాలకు భక్తులు పోటెత్తారు. శివరాత్రి సందర్భంగా ఏకాదశ నమక చమక రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు కొనసాగుతున్నాయి. ఇవాళ శివ మృత్యుంజయ మంత్రం జపిస్తే సకల రోగ బాధలు తగ్గి పూర్ణాయుష్షు లభిస్తుందని చెబుతారు. శివరాత్రి రోజున ఉపవాస, అభిషేక, అర్చనలు చేస్తే సకల శుభాలు కలుగుతాయని చెబుతోంది శివపురాణం.

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శివరాత్రి, సోమవారం కలిసిరావడంతో శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శివదర్శనం కోసం ఆలయాల్లో భక్తులు బారులు తీరారు.

నిత్య, పక్ష, మాస, మహా, యోగ అనే ఐదు రకాల శివరాత్రులున్నాయి. వాటిలో మాఘ బహుళ చతుర్దశి రోజున మహా శివరాత్రి జరుపుకొంటారు. ఇవాళ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. రుద్రుడిగా ఉన్న శివున్ని ప్రసన్నుడిగా చేసేది ఏకాదశ రుద్రాభిషేకం. పరమశివుడిని పరవశుడిగా చేసేవి నమకం, చమకం.  అందుకే నమక చమకాలతో చేసే ఏకాదశ రుద్రాభిషేకం వల్ల రుద్రుడు శాంతించి… భక్తులపై కరుణాకటాక్షాలను ప్రసరిస్తాడని భక్తుల నమ్మకం.