
వాషింగ్టన్: వైట్హౌస్కు రెండోసారి వెళ్లాలనుకున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు నిరాశ ఎదురైంది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ చేసేందుకు ఆయన అనర్హుడని కొలరాడో సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై అనర్హత వేటు వేసింది. 2021 నాటి యూఎస్ క్యాపిటల్ భవనంపై దాడికి సంబంధించిన కేసులో కోర్టు తీర్పు వెలువరించింది.
అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న నేతపై ఇలా అనర్హత పడటం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్రంప్ హింసను ప్రేరేపించారనడానికి బలమైన సాక్ష్యాలున్నాయని కోర్టు తీర్పులో పేర్కొంది. అందువల్ల అమెరికా రాజ్యాంగంలోని14వ సవరణ సెక్షన్ 3 ప్రకారం.. ఆయన ప్రైమరీ ఎన్నికల్లో పోటీకి అనర్హుడని తేల్చింది. కొలరాడో కోర్టు 4- – 3 మెజార్టీతో ఈ తీర్పు వెలువరించింది. దీనిపై యూఎస్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు ట్రంప్కు అవకాశం కల్పించింది. అందుకోసం వచ్చే ఏడాది జనవరి 4 వరకు ఈ ఉత్తర్వుల అమలును నిలిపివేసింది.
ఇదంతా బైడెన్ కుట్ర: ట్రంప్
తనపై అనర్హత వేటు వేస్తూ కొలరాడో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇదంతా అధ్యక్షుడు జో బైడెన్ కుట్రేనని విమర్శించారు. ‘‘ఎన్నికల్లో పోటీ చేయకుండా నన్ను నిలువరించేందుకు జో బైడెన్, ఆయన సమూహం చేస్తున్న విపరీత చర్యలివి. అధ్యక్ష ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు వారు అమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. జో బైడెన్ ప్రజాస్వామ్యానికి ముప్పు. ఓడిపోతారనే ఇలా చట్టసంస్థలను ఆయుధాలుగా చేసుకుని ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటున్నారు’’ అని ట్రంప్ మండిపడ్డారు.
నేనూ పోటీలో ఉండను: వివేక్ రామస్వామి
కొలరాడో కోర్టు తీర్పుపై అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న వివేక్ రామస్వామి కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రంప్ పోటీలో లేకపోతే.. తాను కూడా వైదొలుగుతానని ‘ఎక్స్’లో ప్రకటించారు. ‘‘ట్రంప్ను అనుమతించకపోతే నేను కూడా కొలరాడో ప్రైమరీ బ్యాలెట్ నుంచి వైదొలుగుతా. అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న ఇతర రిపబ్లికన్ నేతలు రాన్ డిశాంటిస్, క్రిస్ క్రిస్టీ, నిక్కీ హేలీ కూడా ఇదే విధంగా చేయాలని డిమాండ్ చేస్తున్న. లేదంటే ఈ చట్టవిరుద్ధమైన నిర్ణయాన్ని వారు మౌనంగా సమర్థించిన వారవుతారు. ఇలాంటి తీర్పుల కారణంగా దేశం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని పేర్కొన్నారు.