ఆస్పత్రిలో పక్కన బెడ్ పై ఉన్న పేషెంట్ మరణిస్తే.. సాధారణంగానే అక్కడున్న మిగతా బాధితులూ భావోద్వేగానికి లోనవుతారు. అదే ఆ డెడె బాడీని అలా ఉంచితే.. మిగిలిన పేషెంట్లు దాన్ని చూస్తూ చికిత్స తీసుకోవాలంటే.. వారి మనోధైర్యం దెబ్బతింటుంది. గుండెల్లో చావు భయం సరిగ్గా నిద్ర కూడా పట్టనివ్వదు. కానీ, ముంబై కార్పొరేషన్ పరిధిలో నడిచే సియాన్ హాస్పిటల్ లో జరిగిన ఇలాంటి ఘటన అందరినీ కలిచివేస్తోంది. చుట్టూ మృతదేహాలను అలానే ఉంచి.. కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ కొనసాగించారు. కరోనాతో ట్రీట్మెంట్ పొందుతూ మరణించిన ఏడుగురి డెడ్ బాడీలను హాస్పిటల్ లోని బెడ్స్ పైనే వదిలేశారు అధికారులు. వాటిని కనీసం మార్చురీకి తరలించకుండా.. బ్లాక్ కలర్ బ్యాగ్ లలో చుట్టి పెట్టారు. అదే వార్డులో పేషెంట్లకు కరోనా ట్రీట్మెంట్ చేస్తున్నారు వైద్యులు.
ఎమ్మెల్యే ట్వీట్.. స్పందించిన హాస్పిటల్ డీన్
సియాన్ హాస్పిటల్ లోని కరోనా వార్డులో డెడ్ బాడీల పక్కనే పేషెంట్లకు ట్రీట్మెంట్ అందిస్తున్న ఈ దారుణ ఘటనను ఓ వ్యక్తి ఫోన్ లో వీడియో తీసి.. బయటపెట్టాడు. దీనిని మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే నితేశ్ రాణే బుధవారం తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. సియాన్ ఆస్పత్రిలో మృతదేహాల పక్కనే పేషెంట్లు నిద్రించాల్సి రావడం దారుణమని అన్నారు. ఇదేం అడ్మినిస్ట్రేషన్, వెరీ వెరీ షేమ్ ఫుల్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మీడియాలో కథనాలు రావడంతో సియాన్ హాస్పిటల్ డాక్టర్ ప్రమోద్ ఇంగేల్ స్పందించారు. కొన్ని కారణాల వల్ల డెడ్ బాడీలు అక్కడే ఉండిపోయాయని, ఆ తర్వాత వాటిని క్లియర్ చేశామని చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై ఎంక్వైరీకి ప్రత్యేక కమిటీని నియమించామని, మరో 24 గంటల్లోనే నివేదిక ఇవ్వాలని ఆదేశించామని తెలిపారు బృహన్ బుంబై మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు.
డెడ్ బాడీలను బందువులు తీసుకెళ్లడం లేదు..
కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారిలో కొందరి బంధువులు ఆ డెడ్ బాడీలను తీసుకెళ్లేందుకు ముందుకు రావడం లేదని చెప్పారు సియాన్ హాస్పిటల్ డీన్ ప్రమోద్. అందువల్లే మృతదేహాలను అలాగే ఉంచాల్సి వచ్చిందన్నారు. అయితే డెడ్ బాడీలను మార్చురీలకు తరలించకపోవడానికి అక్కడ ఖాళీ లేకపోవడమే కారణమని చెప్పారు. మార్చురీలో 15 స్లాట్స్ మాత్రమే ఉండగా.. అందులో 11 ఫిల్ అయిపోయి ఉన్నాయని తెలిపారు. అయితే కరోనాతో మరణించిన వారి బాడీలను అక్కడికి తరలిస్తే మిగతా వారికి సమస్య అవుతుందని అన్నారు. దీంతో కరోనాతో మరణించిన వారి సంబంధీకులకు సమాచారం ఇచ్చి.. వారు రాకపోవడంతో తామే డిస్పోజ్ చేసేందుకు అనుమతి తీసుకునేందుకు ఆలస్యమైందని చెప్పారు. ప్రస్తుతం అక్కడ డెడ్ బాడీలను క్లియర్ చేశామని చెప్పారు ప్రమోద్.
In Sion hospital..patients r sleeping next to dead bodies!!!
This is the extreme..what kind of administration is this!
Very very shameful!! @mybmc pic.twitter.com/NZmuiUMfSW— nitesh rane (@NiteshNRane) May 6, 2020
దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 52952కు చేరింది. అందులో 1783 మంది మరణించగా.. 15267 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 16758 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో 651 మంది మరణించగా.. 3094 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 13013 మంది మహారాష్ట్రలోని వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.