- రెఫర్లకే ప్రయార్టీ ఇస్తున్న మేనేజ్మెంట్
- రామగుండం హాస్పిటల్లో అందని వైద్య సేవలు
'ఇటీవల సింగరేణి కార్మికుడి కుమార్తె డెలివరీ కోసం గోదావరిఖని సింగరేణి ఏరియా హాస్పిటల్ లో చేర్పించారు. పరీక్షించిన డాక్టర్లు డెలివరీ చేసేందుకు సిద్ధమయ్యారు. కాగా ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయాల్సి ఉండగా హాస్పిటల్లో రేడియాలజిస్ట్ లేకపోవడంతో ప్రైవేటు స్కానింగ్ సెంటర్కు పంపించారు. స్కాన్ అప్పటికే ఆలస్యమవ్వగా.. గర్భంలో శిశువు చనిపోయినట్లు రిపోర్ట్ వచ్చింది. సింగరేణి హాస్పిటల్లో అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్ ఉన్నప్పటికీ రేడియాలజిస్ట్ లేకపోవడంతో ఈ దారుణం జరిగింది.
గోదావరిఖని, వెలుగు: గోదావరిఖనిలోని సింగరేణి హాస్పిటల్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత వేధిస్తోంది. పేరుకు పెద్దాసుపత్రి అయినా సరిపడ డాక్టర్లు, సిబ్బంది లేక వైద్య సేవలు అందని పరిస్థితి. దీంతో హాస్పిటల్లో మిషన్లు ఉన్నా స్పెషలిస్ట్లు లేక సింగరేణీయులు ఇబ్బందులు పడుతున్నారు.
వైద్యం అంతంతమాత్రమే
సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలు, కాంట్రాక్ట్ కార్మికుల కోసం నెలకొల్పిన ఏరియా హాస్పిటల్లో వైద్య సేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయి. ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులు, రిటైర్డ్ అయిన కార్మికుల్లో చాలా మంది వయస్సు రీత్యా, గనుల్లో పనిపరిస్థితుల వల్ల మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి, నరాల తీవ్రత, గుండె జబ్బులతో ఇబ్బంది పడుతున్నారు. జనరల్ సర్జన్, ఈఎన్టీ, కార్డియాలజీ, న్యూరాలజీ, యురాలజీ తదితర స్పెషలిస్ట్ డాక్టర్లు లేరు. గుండె జబ్బులు, నరాల వ్యాధితో వచ్చే వారిని హైదరాబాద్ రెఫర్ చేస్తున్నారు. అప్పుడప్పుడు హెల్త్ క్యాంపులు పెట్టి స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. పక్షవాతం వచ్చినవారికి చేసేందుకు ఎంఆర్ఐ స్కానింగ్ అందుబాటులో లేదు.
నలుగురికి ఒక్కరే గైనకాలజిస్ట్..
గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా హాస్పిటల్కు భూపాలపల్లి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, గోలేటి, తదితర ఏరియాల నుంచి డెలివరీ కేసులను పంపిస్తుంటారు. నలుగురు గైనకాలజిస్ట్లు పనిచేయాల్సి ఉండగా ఒక్కరు మాత్రమే డ్యూటీలో ఉంటున్నారు. మరోవైపు హాస్పిటల్లో 225 బెడ్లు ఉండగా ఆర్థోసర్జన్లు, పిల్లల డాక్టర్, మెడికల్ ఆఫీసర్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు. గుండెకు సంబంధించిన 2డీ ఎకో పరీక్షను ప్రతి శనివారం భూపాలపల్లి లేక కొత్తగూడెం హాస్పిటల్ నుంచి రేడియాలజిస్ట్ వచ్చి చేస్తున్నారు. అత్యవసర సేవలకు ప్రైవేటు హాస్పిటళ్లకు వెళ్తున్నారు.
పూర్తి స్థాయిలో వైద్య సేవలందించాలి...
గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా హాస్పిటల్లో రోజుకు కనీసం 1200 నుంచి 1500 ఓపీ ఉంటుంది. వీరికి సరైన వైద్య సేవలందించడంలో మేనేజ్మెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గుండె, నరాలకు సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించడం లేదు. కేవలం రోగులను రెఫర్ చేస్తూ సింగరేణి సొమ్మును ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటళ్లకు దారాదత్తం చేస్తున్నారు. - ఆరెల్లి పోచం, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ
