
మెహిదీపట్నం, వెలుగు: ఏజెన్సీ ఏరియాలో ట్రైబల్ అడ్వైజరీ కమిటీ తీర్మానంతో 100% రిజర్వేషన్లు అమలు చేయాలని లంబాడీ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్నాయక్ డిమాండ్ చేశారు. ఏజెన్సీ డీఎస్సీ సాధన కమిటీ జాదవ్ సోమేశ్, కో కన్వీనర్ వి.రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకాశ్రాథోడ్, కార్యదర్శి గోవిందు నాయక్, ఆదివాసీ విద్యార్థి సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ప్రకాశ్దొర, వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్య కుమార్ తో కలిసి సోమావారం మాసబ్ ట్యాంక్ లోని గిరిజన సంక్షేమ శాఖ భవన్ ముందు నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా రాజేశ్నాయక్ మాట్లాడుతూ.. ఆర్టికల్ 244(1)ను అనుసరించి ఏజెన్సీ ప్రాంతంలో 100 శాతం రిజర్వేషన్లతో డీఎస్సీ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఏజెన్సీ డీఎస్సీ, జనరల్ డీఎస్సీలకు విడివిడిగా నోటిఫికేషన్లు ప్రకటించాలన్నారు. జనరల్ డీఎస్సీతో ఏజెన్సీ ప్రాంత యువతకు అన్యాయం జరుగుతుందన్నారు. కేంద్రం ఎస్టీలకు10 శాతం రిజర్వేషన్ ను 9వ షెడ్యూల్లో చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలన్నారు. పోడు, లావుణి భూములకు పట్టాలు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్చేశారు.