
సికింద్రాబాద్, వెలుగు : అక్రమంగా భవన నిర్మాణం చేపట్టిన నేరెడ్మెట్ కార్పొరేటర్ మీనా రెడ్డి భర్త ఉపేందర్ రెడ్డికి బల్దియా కాప్రా సర్కిల్ అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కాప్రా సర్కిల్ పరిధి మైత్రి ఎన్క్లేవ్ ప్లాట్నం.208లో ఉపేందర్ రెడ్డి ఇంటి నిర్మాణం చేపట్టాడు. మున్సిపాలిటీ నుంచి జీ ప్లస్ వన్కు అనుమతి పొంది.. రూల్స్కు విరుద్ధంగా రెండంతస్తుల బిల్డింగ్ నిర్మించాడు.
అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో షట్టర్లు సైతం నిర్మించాడని అధికారులు వెల్లడించారు. రూల్స్ బ్రేక్ చేసి వ్యతిరేకంగా చేపట్టిన ఈ నిర్మాణాలపై కాప్రా సర్కిల్ అధికారులు ఉపేందర్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసి 7 రోజుల్లో వివరణ ఇవ్వాలని సూచించారు. లేకపోతే బల్దియా నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు.