సిద్దిపేట టౌన్/ మెదక్ (పెద్దశంకరంపేట), వెలుగు: ప్రజావాణి దరఖాస్తుల్లో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిద్దిపేట, మెదక్ కలెక్టర్లు హైమావతి, రాహుల్ రాజ్ ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్, పెద్దశంకరంపేట రైతువేదికల్లో నిర్వహించిన గ్రీవెన్స్లో వారు ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. సిద్దిపేటలో 116 దరఖాస్తులు వచ్చినట్లు ఆఫీసర్లు తెలిపారు.
మెదక్లో 86 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ చెప్పారు. కాగా, ప్రజావాణికి హాజరైన నారాయణఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల సంజీవరెడ్డి కలెక్టర్ను కలిసి స్థానిక సమస్యలు చెప్పారు.
తెలంగాణ తల్లి విగ్రహా ఆవిష్కరణ..
సిద్దిపేట కలెక్టరేట్ లో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని నేడు కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రారంభిస్తారని, ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ కే. హైమావతి ఆఫీసర్లను ఆదేశించారు. గ్రీవెన్స్ అనంతరం ఆఫీసర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె అధికారులతో మాట్లాడారు.
జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని, మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టరేట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.
సెలవు కావాలంటే పై అనుమతి తీసుకోవాలి
చేర్యాల, వెలుగు: మెడికల్ఆఫీసర్ నుంచి అటెండర్ వరకు సెలవు పై వెళ్లాలంటే పై అధికారి అనుమతి తీసుకోవాలని, ఎవరికి వారే లీవ్ లెటర్ రాసుకుని సెలవులు తీసుకునే వారిని సహించేదిలేదని సిద్దిపేట కలెక్టర్ కె.హైమావతి హెచ్చరించారు. సోమవారం మద్దూరు మండలంలోని లద్నూర్ పీహెచ్సీ సెంటర్ను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి, వైద్య సేవలపై ఆరా తీశారు.
అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేస్తూ మెడికల్ ఆఫీసర్ సెలవుల్లో ఉన్నట్లు సిబ్బంది తెలపగా అనుమతి తీసుకున్నారా అని డీఎంహెచ్వోకి ఫోన్ చేసి అడిగారు. ఇష్టానుసారంగా లీవ్ తీసుకుంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పీఎచ్ సీలో అపరిశుభ్రంగా ఉండడం చూసి అటెండర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మద్దూరు పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
