టీఎస్​పీఎస్సీ పేపర్ల లీకేజీపై గప్​ చుప్

టీఎస్​పీఎస్సీ పేపర్ల లీకేజీపై గప్​ చుప్
  • టీఎస్​పీఎస్సీపేపర్ల లీకేజీపై గప్​ చుప్
  • నిరుద్యోగుల సమస్యలు గాలికి
  • భరోసా ఇవ్వని సర్కారు.. పోరాటం ఆపిన ప్రతిపక్షాలు
  • దోషులెవరో తేల్చని సిట్
  • విచారణను సీబీఐకి ఇచ్చేందుకు ప్రభుత్వం నో
  • ప్రక్షాళన లేకుండా పాత బోర్డుతోనే పరీక్షల నిర్వహణ
  • బోర్డుపై నమ్మకం కోల్పోయిన నిరుద్యోగులు
  • ఏఈఈ ఎగ్జామ్స్​కు సగం మందే హాజరు
  • వెలవెలబోతున్న లైబ్రరీలు, ప్రిపరేషన్​ సెంటర్లు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను పట్టించుకునే దిక్కులేకుండాపోయింది. వారికి భరోసా ఇవ్వాల్సిన పాలకపక్షం బీఆర్ఎస్.. ఆ మాటే ఎత్తడం లేదు. టీఎస్​పీఎస్సీ పేపర్ల లీకేజీపై నిరుద్యోగుల తరఫున ఇన్నాళ్లూ పోరాడిన ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు సైలెంట్​ అయ్యాయి. ఒకరో ఇద్దరో  నాయకులు తప్ప మిగతా ఎవరూ మాట్లాడ్తలేరు. లీకేజీ ఆరోపణలు ఎదుర్కొంటున్న పాత బోర్డు ఆధ్వర్యంలోనే మళ్లీ పరీక్షలు నిర్వహిస్తుండటంతో నిరుద్యోగులు ఆ ఎగ్జామ్స్​ రాసేందుకు పెద్దగా ఇంట్రస్ట్​ చూప్తలేరు. ఏఈఈ పరీక్షలకు అప్లయ్​ చేసుకున్న వాళ్లలో సగం మంది మాత్రమే అటెండ్​ కావడం ఇందుకు నిదర్శనం. గతంలో నిర్వహించిన ఏఈఈ పరీక్షలకు 75 శాతానికి పైగా అభ్యర్థులు హాజరు కాగా సోమ, మంగళవారాల్లో నిర్వహించిన పరీక్షలకు 51 శాతం మందే అటెండ్​ అయ్యారు.

ఈసారి పేపర్లు లీక్​కావన్న నమ్మకాన్ని, పకడ్బందీగా కండక్ట్​ చేస్తామన్న భరోసాను ప్రభుత్వం కానీ, టీఎస్​పీఎస్సీ కానీ కల్పించలేకపోతున్నాయి. దీంతో చాలా మంది నిరుద్యోగులు ప్రిపరేషన్​ను పక్కనపెట్టేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లకు ముందు కిటకిటలాడిన హైదరాబాద్​లోని చిక్కడపల్లి సెంట్రల్ ​లైబ్రరీ, అశోక్​నగర్​లోని స్టడీ హాల్స్​ఇప్పుడు బోసిపోయి కనిపిస్తున్నాయి.  

రాష్ట్రంలో 88 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ప్రకటించిన రోజు నుంచి నిరుద్యోగులు జాబ్స్​ కోసం గట్టిగా ప్రిపరేషన్​చేపట్టారు. టీఎస్​పీఎస్సీ, పోలీస్​రిక్రూట్మెంట్, గురుకుల రిక్రూట్మెంట్, మెడికల్​అండ్​హెల్త్​రిక్రూట్మెంట్​బోర్డులు వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు కూడా  ఇచ్చాయి. రాష్ట్రంలోని సుమారు 30 లక్షల మంది నిరుద్యోగులు టీఎస్​పీఎస్సీ వెబ్​సైట్​లో వన్​టైం రిజిస్ట్రేషన్​చేసుకున్నారు. వారంతా తమకు అర్హత ఉన్న ఉద్యోగాలకు దరఖాస్తు పెట్టుకున్నారు. టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్​ ఇచ్చి ఏఈ, గ్రూప్​– 1 ప్రిలిమ్స్, ఏఈఈ, డీఏవో పరీక్షలు నిర్వహించింది. పేపర్లు లీక్​కావడంతో ఈ పరీక్షలన్నీ రద్దయ్యాయి. ఏప్రిల్​లో నిర్వహించాల్సిన హార్టికల్చర్​ఆఫీసర్, అసిస్టెంట్​మోటార్​వెహికల్​ఇన్ స్పెక్టర్, అగ్రికల్చర్​ఆఫీసర్, గ్రౌండ్​వాటర్​గెజిటెడ్, నాన్​గెజిటెడ్​ఆఫీసర్​పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. టీఎస్​పీఎస్సీ పేపర్ల లీకేజీపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్​ ఇన్వెస్టిగేషన్​ టీమ్​ (సిట్)ను ఏర్పాటు చేసింది.

రెండు నెలలు గడిచినా పేపర్ల లీకేజీపై సిట్​పెద్దగా తేల్చిందేమీ లేదు. దీనిపై సీబీఐతో కానీ, సిట్టింగ్​ జడ్జితో కానీ విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు, నిరుద్యోగులు డిమాండ్​ చేసినా.. ధర్నాలు చేసినా.. ప్రభుత్వం ససేమిరా అంటున్నది. పేపర్ల లీకేజీ కింది స్థాయి ఉద్యోగులకే పరిమితమైన అంశం కాదని, బోర్డు పెద్దలకు కూడా దీనిలో ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. యువత నుంచి ఇలాంటి ప్రశ్నలే వస్తున్నా ప్రభుత్వం సరిగా స్పందించడం లేదు. పేపర్ల లీకేజీల వెనుక ఇద్దరు మాత్రమే ఉన్నారని అప్పట్లో మంత్రి కేటీఆర్​కామెంట్​చేయడం విమర్శలకు దారితీసింది.

అంత జరిగినా మళ్లా పాత బోర్డుతోనే..!

టీఎస్​పీఎస్సీ బోర్డులో ఎలాంటి మార్పులు చేయకుండానే ప్రభుత్వం పరీక్షలను మళ్లీ నిర్వహించేందుకు సిద్ధమైంది. బోర్డులో ఎలాంటి ప్రక్షాళన లేకుండా.. కొత్తగా ఒక ఐఏఎస్​అధికారిని కంట్రోలర్​ఆఫ్ ఎగ్జామినేషన్స్​హోదాలో నియమించి పరీక్షల స్టార్ట్​చేశారు. మే, జూన్​ నెలల్లో పలు పరీక్షలు నిర్వహిస్తామని ఇదివరకే షెడ్యూల్​ప్రకటించారు.  గ్రూప్​–1 ప్రిలిమ్స్​జూన్​ 11న నిర్వహించనున్నారు. రద్దు చేసిన పరీక్షల్లో ఏఈఈ (ఎలక్ట్రికల్​అండ్​ ఎలక్ట్రానిక్స్, అగ్రికల్చర్, మెకానికల్​ఇంజనీర్) పరీక్షలను సోమ, మంగళవారాల్లో చేపట్టారు. జనవరి 22న ఇదే పరీక్ష నిర్వహించగా 75 శాతానికిపైగా అభ్యర్థులు హాజరుకాగా.. ఇప్పుడు 51 శాతం నుంచి 55 శాతం మంది మాత్రమే అటెండ్​అయ్యారు. పాత బోర్డు ఆధ్వర్యంలోనే  పరీక్షలు నిర్వహించడంతో, దానిపై నమ్మకం లేక అభ్యర్థులు పెద్దగా హాజరుకాలేదని నిరుద్యోగ, విద్యార్థి సంఘాల నేతలు అంటున్నారు. గతంలో పేపర్​లు లీకైనా ఈసారి నిర్వహించే పరీక్ష పేపర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ లీక్​కావు అనే భరోసా ఇవ్వడంలో ప్రభుత్వం, టీఎస్​పీఎస్సీ విఫలమైందని మండిపడుతున్నారు. పలు పరీక్షలను రానున్న 50 రోజుల్లోనే నిర్వహిస్తామని టీఎస్​పీఎస్సీ షెడ్యూల్​ ప్రకటించినా.. వాటి కోసం ప్రిపేర్​ అయ్యే వారి సంఖ్య కూడా భారీగా తగ్గింది. 

స్పందించని సీఎం..

ఉస్మానియా యూనివర్సిటీ పరిసరాలు, చిక్కడపల్లి సెంట్రల్​ లైబ్రరీ, అశోక్​నగర్​లోని పలు కోచింగ్​ సెంటర్లు వెలవెలబోతున్నాయి. రెండేండ్లుగా కిటకిటలాడిన అశోక్​నగర్ ​స్టడీ హాల్స్​లో కూడా ఎవరూ కనిపించడం లేదు. సర్కారు కొలువు సాధించడమే ధ్యేయంగా ఏండ్లకేండ్లు ప్రిపేర్​అయిన వాళ్లు సైతం పరీక్షల నిర్వహణపై నమ్మకం లేక తమ గ్రామాలకు వెళ్లిపోయారు. ఉద్యోగ నియామకాల్లో ఎలాంటి అవకతవకలకు తావుండదని ధైర్యం కల్పించాల్సిన ప్రభుత్వం ఆ వైపు ఆలోచించడం లేదు. సీఎం కేసీఆర్​ఇప్పటి వరకు పేపర్ల లీకేజీలపై కనీసం స్పందించలేదు. గ్రూప్​–1 ప్రిలిమ్స్​సహా ఇతర కీలక పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని, ఎవరూ సందేహాలు పెట్టుకోవద్దని చెప్పే ప్రయత్నం కూడా చేయడం లేదు.

ఉధృతంగా పోరాడి..

టీఎస్​పీఎస్సీ పేపర్లు లీకైన మొదట్లో కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, వైఎస్సార్​టీపీ, టీజేఎస్​సహా పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు యువతకు మద్దతుగా ఆందోళనలు చేశాయి. నిరుద్యోగ దీక్షలు, రౌండ్​టేబుల్​ సమావేశాలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించాయి. పేపర్ల లీకేజీలతో బోర్డు చైర్మన్​కు సంబంధం లేదని ప్రభుత్వం సమర్థించుకునే ప్రయత్నం చేయగా.. చైర్మన్​ ఆధీనంలోనే పేపర్లు ఉంటాయని ఆధారాలతోపాటు ప్రతిపక్షాలు  బయట పెట్టాయి. న్యాయపోరాటం చేయడంతో పాటు జిల్లాల్లోనూ ఉద్యమాలు సాగించాయి. కొద్ది రోజుల నుంచి ప్రతిపక్షాలు కూడా ఈ అంశంపై క్రమేణా సైడ్ ​అవుతున్నాయి. కొందరు నాయకులు మాత్రమే అప్పుడప్పుడు ఈ అంశంపై స్పందిస్తున్నారు.