మాజీ చీఫ్ జస్టిస్ వేధింపుల వీడియో బయటపెట్టిన కోడలు

మాజీ చీఫ్ జస్టిస్ వేధింపుల వీడియో బయటపెట్టిన కోడలు

తెలంగాణ హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ నూతి రామ్మోహన్ రావు కుటుంబంలో కలహాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. తన భర్త, మామ, అత్త, ఇంటి సహాయకురాలు కలిసి తనపై దాడి చేశారని.. గత ఏప్రిల్ లో నూతి రామ్మోహన్ రావు కోడలు సింధు శర్మ సీసీఎస్ మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. డబ్బుకోసం, అదనపు కట్నం కోసం తన భర్తకు ఆయన తండ్రి మరో పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తున్నాడని… తనను శారీరకంగా, మానసికంగా హింసించారని ఆమె కంప్లయింట్ లో చెప్పారు.  దీనిపై సీసీఎస్ మహిళా పోలీసులు ఆరోజుల్లోనే కేసు నమోదుచేశారు. దర్యాప్తు సందర్భంగా తన వాదన నిజం అని నిరూపించుకునేందుకు తాజాగా ఆమె వీడియో విడుదల చేశారు.

ఆమె విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “వరకట్న వేధింపులు మామూలుగా చదువుకోని వారి ఇళ్లలో చూస్తుంటాం. కానీ… ఓ చీఫ్ జస్టిస్ ఇంట్లో ఇలాంటి వేధింపులు , దాడులు చూడటం దారుణం”అంటూ సోషల్ మీడియా యూజర్స్ స్పందిస్తున్నారు.

తనను మానసిక వికలాంగురాలిగా ముద్రవేసేందుకు తన భర్త నూతి వశిష్ఠ , మామ నూతి రామ్మోహన్ రావు, అత్త నూతి దుర్గ జయలక్షి ప్రయత్నించారని.. తనపై దాడి చేశారని సింధు శర్మ ఈ ఏడాది ఏప్రిల్ లో ఆరోపించారు. అదే సందర్భంలో తండ్రితో కలిసి పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు. గాయాలతో హాస్పిటల్ లో అడ్మిట్ అయి.. చికిత్స పొందారు సింధు శర్మ. పెద్ద కూతురైన రిషితను సింధు శర్మకు అప్పగించాలని గత మే నెలలో హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

వరకట్న వేధింపుల వ్యవహారంలో.. సింధు శర్మ భర్త, మామ, అత్తలపై 498-A, 406,323 IPC, SEC 4 AND 6 OF DP యాక్ట్ కింద కేసు నమోదయ్యాయి.