జోరందుకున్న సింగరేణి ప్రైవేటైజేషన్

జోరందుకున్న సింగరేణి ప్రైవేటైజేషన్

మందమర్రి, వెలుగు: రాష్ట్ర సర్కారు తీరుతో సింగరేణిలో ఏడేండ్లుగా ప్రైవేటైజేషన్​ పెరిగిపోయి, పర్మినెంట్ ​కార్మికులు తగ్గుతున్నారు. తెలంగాణ వస్తే  ఓపెన్​కాస్టులకు బదులు  అండర్​ గ్రౌండ్ ​బాయిలను ఏర్పాటు చేసి పర్మినెంట్ ​కార్మికుల సంఖ్యను లక్షకు పెంచుతామని ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్​అనేకసార్లు చెప్పారు. కానీ తెలంగాణ ఏర్పడి ఏడేండ్లు గడిచినా సింగరేణిలో కొత్తగా ఒక్కటంటే ఒక్క అండర్​గ్రౌండ్​ మైన్​ను ఏర్పాటు చేయలేదు. పైగా ఉన్నవాటిలో 13 మూతపడ్డాయి. సేమ్ ​టైం ఓసీపీలు14 నుంచి 20కి పెరిగాయి. ఓసీపీలతో పాటే ప్రైవేటైజేషన్ కు తలుపులు తెరిచారు. ఒక్కో విభాగాన్ని కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ వచ్చారు. ఫలితంగా 2014లో 59 వేలుగా ఉన్న పర్మినెంట్​ కార్మికుల సంఖ్య ప్రస్తుతం 43 వేలకు పడిపోయింది. అదే సమయంలో అప్పుడు 18వేలుగా ఉన్న కాంట్రాక్ట్​ కార్మికులు ఇప్పుడు 30 వేలకు చేరుకున్నారు. తాజాగా రాష్ట్రంలోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేసేందుకు కేంద్రం యత్నిస్తుండడంతో సింగరేణి ప్రైవేటీకరణకు కుట్ర పన్నుతోందని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు విమర్శిస్తున్నారు. మరి ఏడేండ్లుగా టీఆర్ఎస్​ సర్కారు చేస్తున్నది ప్రైవేటీకరణ కిందికి రాదా? అని కార్మికులు, కార్మిక సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. 

ఏడేండ్లలో ప్రైవేటీకరణ జోరు
టీఆర్​ఎస్​ సర్కార్​ కంట్రోల్​లో పనిచేసే సింగరేణి మేనేజ్​మెంట్​గడిచిన ఏడేండ్లుగా అధికోత్పత్తే  లక్ష్యంగా పనిచేస్తోంది. ఇందులో భాగంగా మెకనైజేషన్​, ప్రైవేటైజేషన్​ను ప్రోత్సహిస్తోంది. ఎక్కువ మంది కార్మికులకు ఉపాధినిచ్చే యూజీలను కాదని ఓసీపీలను పెంచుతోంది. 2003లో కోయగూడెం సర్ఫేస్​ మైన్​ను ప్రైవేటుకు అప్పగించడాన్ని నిరసిస్తూ సింగరేణిలో 17 రోజుల సమ్మె జరిగింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన అతిపెద్ద సమ్మెగా దీన్ని చెప్పొచ్చు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ ప్రభావంతో జాతీయ కార్మిక సంఘాలు ఛరిస్మా కోల్పోయాయి.  2012, 2017  సంవత్సరాల్లో వరుసగా  టీఆర్​ఎస్​ అనుబంధ టీబీజీకేఎస్​ గుర్తింపు సంఘంగా ఎన్నికైంది. 2014 తర్వాత  రాష్ట్రంలో ప్రభుత్వం, సింగరేణిలో గుర్తింపు సంఘం, యాజమాన్యంపై పెత్తనం.. ఇలా అన్నీ టీఆర్ఎస్​పెద్దల కంట్రోల్​లోకి వచ్చాయి. దీంతో ప్రైవేటైజేషన్​ స్పీడ్​ పెంచారు. మొదట్లో సర్ఫేస్​ డిపార్ట్​మెంట్లన్నింటినీ ప్రైవేటుపరం చేశారు. తర్వాత ఓసీపీల్లో ఓబీ(ఓవర్​బర్డెన్​) వెలికి తీసే పనులను కాంట్రాక్ట్​ సంస్థలకు అప్పగించడం మొదలైంది. సింగరేణి  కంపెనీ వెహికల్స్​ తొలగించి ప్రైవేటు వాళ్లకు చాన్స్​ ఇచ్చారు. గెస్ట్​ హౌస్​లు, సివిల్​ డిపార్ట్​మెంట్లనూ కాంట్రాక్టర్లకు అప్పగించారు. కోల్​ ట్రాన్స్​పోర్ట్,​ సీహెచ్​పీల్లో షేల్​ పికింగ్​, ఎస్​అండ్​పీసీ లాంటి విభాగాల్లోనూ ప్రైవేట్​, అవుట్​సోర్సింగ్​ఏజెన్సీలను దింపేశారు.  ఆఖరికి కంపెనీ దవాఖానాల్లోనూ వార్డుబాయ్స్​, స్టాఫ్​ నర్సులు, ల్యాబ్​ టెక్నీషియన్లుగా కాంట్రాక్ట్​ సిబ్బందిని నియమించారు.  పర్మినెంటు పనిస్థలాల్లో కూడా కాంట్రాక్ట్​ ఎంప్లాయీస్​​కు చోటు కల్పించడం ప్రారంభించారు.  మెకనైజ్డ్​ మైన్స్​ పేరుతో యూజీలో ఉత్పత్తి ఖర్చు తగ్గించేందుకు  రూఫ్​ బోల్టింగ్​ పనులు, కోల్​ కటింగ్​, ట్రామింగ్​, టింబరింగ్​ పనుల్లో కాంట్రాక్ట్​ ఎంప్లాయీస్​కు చోటిచ్చారు. ఫైర్​సీల్స్​, టబ్​ క్లీనింగ్​ పనులు కూడా కాంట్రాక్ట్​, అవుట్​ సోర్సింగ్​ద్వారా చేపడుతున్నారు. మొత్తంమీద ఓసీపీల్లో 70శాతం, డిపార్ట్​మెంట్లలో 70శాతం, యూజీల్లో 30శాతం ప్రైవేట్​ సంస్థల చేతుల్లో పెట్టేశారు. ఇటీవల శాంతిఖని వంటి గనుల్లో నేరుగా బొగ్గు ఉత్పత్తి ప్రక్రియలో కూడా ప్రైవేటు సంస్థలకు ఛాన్స్​ కల్పించడాన్ని బట్టి సింగరేణిలో ప్రైవేటీకరణ ఎంత పీక్స్​కు చేరిందో అర్థం చేసుకోవచ్చు.

తగ్గుతున్న పర్మినెంట్​ కార్మికులు
సింగరేణి లో  ప్రైవేటీకరణ కారణంగా పర్మినెంట్​ కార్మికుల సంఖ్య తగ్గుతూ కాంట్రాక్ట్​ ఎంప్లాయీస్​ సంఖ్య పెరుగుతోంది.  1989-–90లో లక్షా 16వేల మంది పర్మినెంట్​ కార్మికులు ఉంటే 2014 నాటికి 59వేలకు చేరారు. అప్పుడు 36 అండర్​ గ్రౌండ్​ మైన్స్, 14 ఓపెన్​కాస్ట్​ గనులుండగా, ఈ   ఏడేండ్ల లో అండర్​ గ్రౌండ్​ మైన్ల సంఖ్య 23, ఓసీపీలు సంఖ్య 20కి చేరింది. ఉన్న యూజీలు మూతపడడం , కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఓసీపీలను ప్రైవేట్​ కు అప్పగిస్తుండడంతో పర్మినెంట్​ కార్మికుల సంఖ్య 43 వేలకు పడిపోయింది.  అదే టైంలో కాంట్రాక్ట్​ కార్మికుల సంఖ్య 18వేల నుంచి 30వేలకు పెరిగింది. అంటే టీఆర్ఎస్​ అధికారంలోకి వచ్చాక 13వేల మంది పర్మినెంట్​ కార్మికులు తగ్గిపోతే 12వేల మంది కాంట్రాక్ట్​ కార్మికులు పెరిగారు. దీన్ని బట్టి సింగరేణిలో ప్రైవేటీకరణ ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చని కార్మికులు, కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. 

మనయి వద్దు.. పక్కయి ముద్దు.. 
మంచిర్యాల జిల్లాలోని కల్యాణిఖని     బ్లాక్‌ - 6, శ్రావణపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోయగూడెం బ్లాక్‌-3, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి బ్లాక్‌-3 ఓసీపీలను కోల్​మినిస్ట్రీ ఆధ్వర్యంలో గత డిసెంబర్​లో వేలం వేశారు. ఈ గనులన్నీ మనరాష్ట్రంలో అదీ  సింగరేణి పరిధిలోనే ఉన్నప్పటికీ  ఏ ఒక్కదానికి సింగరేణి టెండర్​ వేయలేదు. మేనేజ్​మెంట్​పై రాష్ట్ర సర్కారు నుంచి ఉన్న ప్రెజరే ఇందుకు కారణమని ఆరోపణలు వచ్చాయి. ఈ నాలుగింట్లో కోయగూడెం కోల్​బ్లాక్ కు మాత్రమే ఓ ప్రైవేట్​ సంస్థ బిడ్​ వేయగా, సింగిల్​ టెండర్​​ కావడంతో క్యాన్సిల్​చేశారు.  ఇలా రాష్ట్రంలో అందుబాటులో ఉన్న  బొగ్గు బ్లాకులను వద్దనుకున్న సింగరేణి,  ఒడిశాలోని బొగ్గు గనుల కోసం మాత్రం వెంపర్లాడుతోంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలోని నైని కోల్​బ్లాక్ ను​దక్కించుకోగా, దాని పక్కనే ఉన్న బంఖుయ్​ కోల్​బ్లాక్​ కోసం మంగళవారం కోల్​మినిస్ట్రీ నిర్వహించిన వేలంలో పాల్గొన్నది.  ఇలా మనవాటిని వద్దనుకొని పొరుగురాష్ట్రాల్లో బొగ్గు బాయిలకు ఆరాటపడుతున్న సింగరేణి యాజమాన్యం తీరుపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.