- ఇప్పుడు ఎన్నికలు నిర్వహించలేమని కలెక్టర్లతో కేంద్ర కార్మిక శాఖకు లేఖలు
- బీఆర్ఎస్కు ఓటమి భయం పట్టుకుందని కార్మిక సంఘాల ఎద్దేవా
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు వాయిదా వేసేందుకు రాష్ట్ర సర్కారు సీరియస్గా ప్రయత్నిస్తోంది. ఎన్నికలు నిర్వహించాలని గతేడాది హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో ఆ దిశగా కొంత కసరత్తు జరుగుతోంది. ఇందులో భాగంగానే ఇటీవల అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య చర్చలు కొలిక్కివచ్చాయి. ఆగస్టులో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తామనే సమాచారం బయటకు వచ్చింది. దీంతో బీఆర్ఎస్ సర్కారు ఒక్కసారిగా అలర్ట్ అయింది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడం, అంతకుముందు జరిగే సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్ ఓడిపోతే కోల్బెల్ట్లో బీఆర్ఎస్కు మైనస్ అవుతుందని సర్కారు ఆలోచిస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికలకు తాము రెడీగా లేమని కలెక్టర్లతో కేంద్ర కార్మిక శాఖకు లెటర్లు రాయిస్తున్నట్లు తెలిసింది.
త్వరలోనే షెడ్యూల్ వస్తుందని భావించినా..
ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో విస్తరించిన సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలను మినీ అసెంబ్లీ ఎన్నికలుగా భావిస్తారు. ప్రధాన పార్టీలకు చెందిన అనుబంధ కార్మిక సంఘాలన్నీ బరిలో ఉండడం, అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో ఆయా పార్టీలన్నీ ఎన్నికలను చాలెంజింగ్గా తీసుకుంటాయి. చివరిసారి 2017లో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్విజయం సాధించింది. రెండేండ్ల పీరియడ్పై గెలిచిన టీబీజీకేఎస్గతంలో మాదిరి నాలుగేండ్ల పీరియడ్ కోసం హైకోర్టును ఆశ్రయించింది. ఆ పరిమితి కూడా 2021తో ముగిసింది. తర్వాత రెండేండ్లుగా ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఏఐటీయూసీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో గతేడాది అక్టోబర్ 28న ఎన్నికల నిర్వహణపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎలక్షన్స్పై కదలిక మొదలైంది. నవంబర్ 29న మూడు నెలల్లో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని సింగరేణి యాజమాన్యానికి కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు లేఖ రాశారు. ఈ క్రమంలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో యాజమాన్యం, కార్మిక సంఘాల మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. గతేడాది డిసెంబర్, జనవరి నెలల్లోఎన్నికలు జరుగుతాయని భావించినా కోల్ ప్రొడక్షన్కు విఘాతం కలుగుతుందనే సాకుతో యాజమాన్యం అడ్డుకుంది. ఇందులో భాగంగానే ఈ నెల 13న హైదరాబాద్లో యాజమాన్యం, కార్మిక సంఘాలతో కేంద్ర కార్మిక శాఖ ప్రత్యేక మీటింగ్నిర్వహించింది. ఈ నెల 24న మరోసారి సమావేశమై అదేరోజు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని, ఆగస్టులో ఎన్నికలు ఉండే చాన్స్ ఉందని ఆఫీసర్లు ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి.
ఎన్నికలకు రెడీగా లేమంటూ కలెక్టర్లతో లేఖలు..
ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో విస్తరించిన సింగరేణి 11 ఏరియాల్లో దాదాపు 42వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. కాగా, ప్రస్తుతం సింగరేణి వ్యాప్తంగా బీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ముఖ్యంగా కోల్బెల్ట్నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ సంక్షేమం మరిచారని, సింగరేణి నిధులను దారి మళ్లిస్తున్నా పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో ఉన్నారు. ఇలాంటి తరుణంలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తే తమ అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్కు ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశముందని సర్కారు భావిస్తోంది. ఈ ప్రభావం రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై పడే ప్రమాదముందని భయపడ్తోంది. ఈ క్రమంలోనే కోల్బెల్ట్ పరిధిలోని కలెక్టర్లతో తాము ఎన్నికలకు సిద్ధంగా లేమని లెటర్లు ఇప్పిస్తున్నట్లుతెలిసింది. కొత్తగూడెం కలెక్టర్ ఇప్పటికే కేంద్ర కార్మిక శాఖకు లేఖరాసినట్లు కార్మిక సంఘాల్లో చర్చ జరుగుతోంది.