
దిస్పూర్: ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ మృతి కేసు కీలక మలుపు తిరిగింది. సెప్టెంబర్ 19న జుబీన్ సింగపూర్లో ప్రమాదవశాత్తూ నీట మునిగి చనిపోయినట్లు ఇప్పటిదాకా అందరూ అనుకుంటుండగా.. ఇప్పుడు విషప్రయోగం అనే కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. విషమిచ్చి జుబీన్ను చంపి ఉంటారని ఆయన బ్యాండ్మేట్ శేఖర్ జ్యోతి గోస్వామి సంచలన ఆరోపణలు చేశాడు.
జుబీన్ మేనేజర్ సిద్ధార్థ్ శర్మ , నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ ఈవెంట్ ఆర్గనైజర్ శ్యామ్కాను మహంతపై తనకు అనుమానం ఉందని అస్సాం పోలీసుల స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)కు తెలియజేశాడు. సిట్ అధికారులకు శేఖర్ జ్యోతి గోస్వామి ఇచ్చిన వాగ్మూలం ప్రకారం.."జుబీన్, అతని మేనేజర్ సిద్ధార్థ్ శర్మ సింగపూర్లోని పాన్ పసిఫిక్ హోటల్లో ఒకే హోటల్లో కలిసి ఉన్నారు.
జుబీన్ పడవలో సముద్రంలో విహరించేందుకు వెళ్లగా.. నౌకను మేనేజర్ సిద్ధార్థ్ శర్మ బలవంతంగా తన నియంత్రణలోకి తీసుకున్నాడు. డ్రింక్స్ ఎవరూ ఏర్పాటు చేయవద్దని, తనే స్వయంగా అందరికీ డ్రింక్స్ అందిస్తానని తన్మోయ్ ఫుకాన్ (సింగపూర్ అస్సాం అసోసియేషన్ సభ్యుడు)కు సూచించాడు. సిద్ధార్థ్ శర్మనే నౌకలోని వారందరికీ స్వయంగా డ్రింక్స్ తీసుకొచ్చాడు" అని వివరించాడు.
జుబీన్ మంచి స్విమ్మర్
జుబీన్ మంచి శిక్షణ పొందిన స్విమ్మర్ అని.. తనతో పాటు ఎంతోమందికి స్విమ్మింగ్లో కోచింగ్ ఇచ్చాడని సిట్ అధికారులకు శేఖర్ జ్యోతి గోస్వామి తెలియజేశాడు. ప్రమాదం జరిగిన తర్వాత సిద్ధార్థ్ శర్మ తీరు అనుమానాస్పదంగా కన్పించింది. అతనే ఈవెంట్ ఆర్గనైజర్ శ్యామ్కాను మహంతతో కలిసి జబీన్కు విషమిచ్చి ఉంటాడు. తర్వాత దాన్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి ఉంటారు" అని గోస్వామి తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. కాగా.. జుబీన్ గార్గ్ రెండో పోస్ట్మార్టం నివేదికను అస్సాం పోలీసులు ఆయన భార్య గరిమా సైకియా గార్గ్కు అందజేశారు.