లండన్: కెరీర్లో 25వ గ్రాండ్స్లామ్ వేటలో ఉన్న సెర్బియా సూపర్ స్టార్ నొవాక్ జొకోవిచ్ మళ్లీ విఫలమయ్యాడు. వింబుల్డన్లో భాగంగా శుక్రవారం జరిగిన మెన్స్ సింగిల్స్ సెమీస్లో ఏడోసీడ్ జొకోవిచ్ 4–6, 4–6, 6–4తో టాప్సీడ్ యానిక్ సినర్ (ఇటలీ) చేతిలో ఓడాడు. 2 గంటలా 20 నిమిషాల మ్యాచ్లో జొకో అటాకింగ్ గేమ్లో వెనకబడ్డాడు. 8 ఏస్లు, 3 డబుల్ ఫాల్ట్స్ చేశాడు.
తన సర్వీస్లో 64 శాతం పాయింట్లే రాబట్టాడు. ఒక్క బ్రేక్ పాయింట్ కూడా రాబట్టలేదు. 26 విన్నర్లు, 23 అన్ఫోర్స్డ్ ఎర్రర్స్ చేశాడు. 40 విన్నర్లు కొట్టిన సినర్ మూడు బ్రేక్ పాయింట్లను కాచుకున్నాడు. 16 ఏస్లతో మ్యాచ్ ముగించాడు.
మరో సెమీస్లో రెండో సీడ్ జ్వెరెవ్ 7–6 (7/0), 6–2, 6–4తో ఆర్థర్ ఫెరీ (బ్రిటన్)పై గెలిచాడు. రెండు గంటలా 14 నిమిషాల మ్యాచ్లో జ్వెరెవ్ అటాకింగ్ గేమ్తో ఫెరీని నిలువరించాడు. బలమైన సర్వీస్లతో వరుసగా పాయింట్లు రాబట్టాడు. తొలి గేమ్లో గట్టి పోటీ ఇచ్చిన ఫెరీ తర్వాతి గేమ్ల్లో తేలిపోయాడు. మ్యాచ్ మొత్తంలో 9 ఏస్లు కొట్టిన జ్వెరెవ్ 2 డబుల్ ఫాల్ట్స్ చేశాడు.
తన సర్వీస్లో 77 శాతం పాయింట్లు రాబట్టాడు. ఎనిమిది బ్రేక్ పాయింట్లలో నాల్గింటిని కాచుకున్నాడు. 44 విన్నర్లు, 31 అన్ఫోర్స్డ్ ఎర్రర్స్తో ముగించాడు.
