యాక్షన్ కింగ్ అర్జున్ దర్శక నిర్మాతగా ఆయన కూతురు ఐశ్వర్యను హీరోయిన్గా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం ‘సీతా పయనం’. కన్నడ స్టార్ ఉపేంద్ర అన్న కొడుకు నిరంజన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు అతిథిగా హాజరైన హాస్యనటుడు బ్రహ్మానందం.. అర్జున్తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఈ చిత్రంతో తన కూతురు ఐశ్వర్యకు మంచి పేరు రావాలని కోరారు.
దర్శక నిర్మాత అర్జున్ మాట్లాడుతూ ‘ఇదొక డిఫరెంట్ జానర్ కథ. నా కూతురికి ఓ బహుమతిలా ఈ సినిమాని ఇవ్వాలని అనుకున్నా. అలాగే ప్రేక్షకులకు మంచి చిత్రాన్ని చూపించాలనే బాధ్యతతో ఎంతో నిజాయితీగా తీశా. సున్నితమైన అంశాలతో తెరకెక్కించినా అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా బంధాల విలువలను చాటి చెప్పే చిత్రమిది’ అని అన్నారు.
ఈ చిత్రం తనకొక ఎమోషన్ అని, నాన్న పేరు నిలబెట్టేందుకు ప్రయత్నించానని ఐశ్వర్య అర్జున్ చెప్పింది. అభి పాత్రలో అందర్నీ అలరిస్తానని నిరంజన్ అన్నాడు. నటులు సత్యరాజ్, అశోక్ కుమార్, డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.
