- జియో సినిమా యాప్, స్పోర్ట్స్ 18లో మ్యాచ్ల లైవ్
ముంబై: ఐర్లాండ్ టూర్లో టీమిండియాకు హెడ్ కోచ్గా సితాన్షు కొటక్ను నియమించారు. ఎమర్జింగ్ కప్, ఆసియా కప్ నేపథ్యంలో ఎన్సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ ఇండియాలోనే ఉండిపోవాల్సి రావడంతో సితాన్షుకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం సితాన్షు ఇండియా–ఎ హెడ్ కోచ్గా, ఎన్సీఏలో బ్యాటింగ్ కోచ్గా పని చేస్తున్నాడు. బుమ్రా కెప్టెన్సీలోని ఇండియాకు సాయిరాజ్ బహుతులే బౌలింగ్ కోచ్గా వ్యవహరించనున్నాడు.
డొమెస్టిక్ క్రికెట్లో సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహించిన సితాన్షు.. తన కెరీర్లో 8 వేల ఫస్ట్ క్లాస్ రన్స్తో పాటు 3 వేల లిస్ట్–ఎ రన్స్ సాధించాడు. 2019లో రాహుల్ ద్రవిడ్ ఎన్సీఏ చీఫ్గా వెళ్లడంతో సితాన్షును ఇండియా–ఎ కోచ్గా ఎంపికయ్యాడు. ఇక వెస్టిండీస్తో టీ20 సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా కోచింగ్ బృందం రాహుల్ ద్రవిడ్, విక్రమ్ రాథోడ్, పారస్ మాంబ్రే ఇండియాకు తిరిగి రానున్నారు. వారం రోజుల విరామం తర్వాత ఆసియా కప్ ప్రిపరేషన్స్లో పాల్గొంటారు.
ఐర్లాండ్తో సిరీస్కు ఎంపికైన ప్లేయర్లు రెండు విడతలుగా డబ్లిన్కు చేరుకుంటారు. బుమ్రాతో పాటు మరికొంత మంది ప్లేయర్లు మంగళవారం ముంబై నుంచి డబ్లిన్కు బయలుదేరతారు. సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మతో కూడిన మిగతా ప్లేయర్లు ఫ్లోరిడా నుంచి వస్తారు. ఐర్లాండ్తో టీ20 సిరీస్ ప్రత్యక్ష ప్రసారాల హక్కులను వయాకామ్ దక్కించుకుంది. దీంతో ఈ నెల 18, 20, 23న జరిగే మ్యాచ్లు జియో సినిమా యాప్, స్పోర్ట్స్ 18లో రా. 7.15 నుంచి ప్రత్యక్ష ప్రసారం అవుతాయి.