- చైనాతో చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం
- దశల వారీగా చర్చలు కొనసాగుతున్నయి
- భవిష్యత్తులోనూ కంటిన్యూ చేస్తం
- నేపాల్తో మనది స్ట్రాంగ్ రిలేషన్షిప్
- ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణె వెల్లడి
న్యూఢిల్లీ: బార్డర్లో అంతా కంట్రోల్లోనే ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణె శనివారం చెప్పారు. చైనా ఉన్నతాధికారులతో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే అంతా సర్దుకుంటుందని ఆయన అన్నారు. మన దేశం, చైనా సీనియర్ మిలిటరీ కమాండర్ల మధ్య శుక్రవారం ఫలవంతమైన చర్చలు జరిగాయని, సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నదే రెండు దేశాల ఉద్దేశమని ఆయన తెలిపారు. ఈ నెల 6 న రెండు దేశాల సైనికాధికారుల మధ్య తొలి దశ చర్చలు జరిగాయన్నారు. ఈ ప్రక్రియ ఇకముందు కూడా కొనసాగుతుందని ఆర్మీ చీఫ్ చెప్పారు. చర్చల ద్వారా రెండువైపులా ఉన్న అపోహలు తొలిగి, త్వరలోనే బార్డర్లో సాధారణ పరిస్థితి నెలకొంటుందని నరవాణె ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం డెహ్రడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్ మాట్లాడుతూ.. ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో దేశ భద్రత, గౌరవం యంగ్ ఆఫీసర్ల శక్తిసామర్థ్యాలపైనే ఆధారపడి ఉందన్నారు. దేశంలోని యువత పెట్టుకున్న అంచనాలకు తగ్గట్లుగా పనిచేయాలని ఆయన కొత్తగా డ్యూటీల్లోకి చేరబోతున్న ఆఫీసర్లను కోరారు.
నేపాల్తో బలమైన బంధం
భౌగోళికంగా, కల్చర్ పరంగా, చారిత్రకంగా… ఎలా చూసినా నేపాల్తో మనకు బలమైన బంధముందని నరవాణె చెప్పారు. ఈ బంధం ఎప్పటికీ బలంగానే ఉంటుందని ఆయన వివరించారు. నేపాల్ సైనికుల కాల్పుల్లో మన పౌరుడు ఒకరు చనిపోవడం, మరో ఇద్దరికి బుల్లెట్ గాయాలు తగిలిన ఇష్యూపై ఆర్మీ చీఫ్ మాట్లాడారు. ఈ సంఘటన దురదృష్టకరమన్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రాథమిక వివరాలతో హోంమంత్రిత్వ శాఖకు రిపోర్ట్ అందించామని చెప్పారు.
టెర్రరిజంతో కాశ్మీరీలు విసిగిపోయారు
జమ్మూ కాశ్మీర్లో టెర్రర్ కార్యకలాపాలతో, టెర్రరిస్టులతో ప్రజలు విసిగి పోయారని జనరల్ ఎంఎం నరవాణె చెప్పారు. సాధారణ పరిస్థితి నెలకొనాలని వారు కోరుకుంటున్నారని వివరించారు. గత పది, పదిహేను రోజుల్లో సెక్యూరిటీ బలగాలు చేపట్టిన పలు ఆపరేషన్లు అన్నింటిలోనూ విజయం సాధించడానికి స్థానికుల సహకరించడమే కారణమన్నారు. వాళ్లు ఇచ్చిన సమాచారంతోనే ఆపరేషన్లు జరిపి, 15 మందికి పైగా టెర్రరిస్టులను సెక్యూరిటీ బలగాలు ఏరిపారేశాయని ఆర్మీ చీఫ్ గుర్తుచేశారు.
చైనా సైనికుల పోకడతో టెన్షన్
లడఖ్ లోని పాన్గాంగ్ లేక్ రీజియన్లో చైనా సైనికుల పెట్రోలింగ్ రెండు దేశాల మధ్య టెన్షన్లకు దారితీసింది. అక్కడి గగనతలంపై చైనా హెలికాప్టర్లు చక్కర్లు కొట్టాయి. సరస్సుకు 200 కిలోమీటర్ల దూరంలోని ఎయిర్ పోర్ట్లో చైనా ఎయిర్ ఫోర్స్ జెట్స్ ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాలు కన్ఫర్మ్ చేయడమూ ఆందోళనలను పెంచింది. ఇదంతా రొటీన్ పెట్రోలింగ్ డ్యూటీలో భాగమేనని చైనా సమర్థించుకుంది. మన ఆర్మీ కూడా అక్కడ పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించింది.