6 హామీలకు దరఖాస్తులు సరే.. కొత్త రేషన్ కార్డులేవి?: బండి సంజయ్​

6 హామీలకు దరఖాస్తులు సరే.. కొత్త రేషన్ కార్డులేవి?: బండి సంజయ్​
  • రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షలకు పైగా రేషన్​ కార్డు దరఖాస్తులు పెండింగ్​

  • బీఆర్ఎస్ ఓడినా కేటీఆర్​అహంకారం తగ్గలే

  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్

కరీంనగర్: కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రధానమైన 6 హామీలను అమలు కోసం దరఖాస్తుల స్వీకరణను స్వాగతిస్తున్నామని  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. అయితే తెల్ల రేషన్ కార్డే అందుకు ప్రధాన అర్హతగా పేర్కొనడం పట్ల సందేహం వ్యక్తం చేశారు. కరీంనగర్​లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘కాంగ్రెస్​6 హామీలకు దరఖాస్తులు సరే.. కొత్త రేషన్ కార్డులేవి? రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఇంకా లక్షలాది మంది రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకునేందుకు రెడీగా ఉన్నరు. 

కాంగ్రెస్​ ప్రభుత్వం తక్షణమే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించాలి. 6 గ్యారెంటీల హామీలను వారికి సైతం వర్తింపజేయాలని బీజేపీ జాతీయ ప్రధార కార్యదర్శి బండి సంజయ్​ అన్నారు. రాజకీయాలకు అతీతంగా లబ్దిదారులను గుర్తించేందుకు అన్ని పార్టీలను భాగస్వాములను చేయండి. ముందు 6 గ్యారెంటీల అమలుకు నిధులెలా సమకూరుస్తరు? అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణను ఎట్లా గట్టెక్కిస్తారో సమాధానం చెప్పాలి. ముస్లిం దేశాలే నిషేధించిన తబ్లిక్ జమాతేకు నిధులెట్లా ఇస్తరు? గతంతో కోవిడ్  మహమ్మారి ప్రబలడానికి తబ్లిక్ జామాతే కారణం. ఉగ్రవాదులను తయారు చేసే సంస్థకు నిధులివ్వడం వెనుక ఉద్దేశమేంటి? ప్రభుత్వం తక్షణమే నిధులను ఉపసంహరించుకోవాలి. ఇలాంటి సంస్థలను ప్రోత్సహిస్తే శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంది’ అని అన్నారు.

కేటీఆర్​ఇంకా భ్రమల్లోనే ఉన్నడు

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని బండి సంజయ్​అన్నారు. ‘బీఆర్ఎస్ ను ప్రజలు ఓడించినా కేటీఆర్​అహంకారం తగ్గలేదు. ఇంకా అధికారంలో ఉన్నట్లుగా భ్రమల్లో ఉంటూ మాట్లాడుతున్నడు. 50 లక్షల కోట్ల సంపద సృష్టిస్తే.. ఒకటో తేదీన జీతాలు ఎందుకు ఇవ్వలేదు. భూములు ఎందుకు అమ్మాల్సి వచ్చింది. దళిత బంధు అందరికీ ఎందుకు ఇవ్వలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీదారు కానేకాదు. వారి డిపాజిట్లు గల్లంతు కావడం తథ్యం’ అని సంజయ్​అన్నారు