
- కొత్తగూడెంలో ప్రయాణికుల పాట్లు.. పట్టించుకోని అధికారులు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : అమృత్ భారత్ స్కీంలో భాగంగా రూ. 25.41కోట్లతో కొత్తగూడెం (భద్రాచలం రోడ్ ) రైల్వే స్టేషన్లో చేపడుతున్న ఆధునికీకరణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. అధికారులు పట్టించుకోవడం లేదు.. ప్రయాణికులు పాట్లు తప్పడం లేదు.
ఇదీ పరిస్థితి..
దేశంలోని రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్కీంలో భాగంగా దశల వారీగా ఆధునికీకరిస్తున్నామని ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ క్రమంలో నే అమృత్ స్కీంలో చేపట్టిన పలు రైల్వే స్టేషన్లను ఆయన ప్రారంభించారు. కొత్తగూడెం రైల్వే స్టేషన్ను ఆధునికీరించడంతోపాటు ప్రయాణికుల కోసం పలు సౌకర్యాలను కల్పించేందుకు రైల్వే శాఖ రూ. 25.41 కోట్లను కేటాయించింది. 2023లో పనులు మొదలయ్యాయి. ఏడాదిలోపు పనులు పూర్తి కావాల్సి ఉన్నా ఇప్పటి వరకు 60శాతం పనులు కూడా పూర్తి కాలేదు. ప్లాట్ఫాంతో పాటు వెయిటింగ్హాల్, ఎస్కలేటర్, లిఫ్ట్ లాంటి పనులు ఆగుతూ సాగుతున్నాయి.
అవస్థల్లో ప్రయాణికులు..
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుంచి నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. ప్రముఖ్య పుణ్యక్షేత్రమైన భద్రాచలంతో పాటు పాల్వంచ, కొత్తగూడెం, మణుగూరు లాంటి పారిశ్రామిక ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుంచే రాకపోకలు సాగిస్తుంటారు. ఆధునికీకరణ పనుల్లో తీవ్ర జాప్యంతో ప్రయాణికులు స్టేషన్ ఆవరణలోనే పడిగాపులు పడాల్సి వస్తోంది. ప్రస్తుతం వానలు కురుస్తుడడంతో వారి ఇబ్బందులు రెట్టింపు అయ్యాయి. పనుల్లో జాప్యంపై ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ఇప్పటికే సీరియస్
అయ్యారు.
క్వాలిటీ లేని పనులు.
రైల్వే స్టేషన్ పనుల్లో నాణ్యత లోపించింది. పనులు చేపడుతున్న క్రమంలో పగుళ్లు ఏర్పడుతుండడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇబ్బందిగా ఉంది..
రైల్వే స్టేషన్ పనులు ఏండ్ల తరబడి కొనసాగుతుండడంతో ఇబ్బందిగా ఉంది. వర్షం వచ్చినప్పుడు తడిసిపోతున్నాం. రైల్వే అధికారులు స్పందించి పనులు త్వరగా పూర్తి చేయాలి.
కాసర్ల రాజమల్లు, ప్రయాణికుడు
ఎవరూ పట్టించుకోవట్లే..
రైల్వే స్టేషన్ఆధునికీకరణ పనులు స్లోగా నడుస్తుండడంపై రైల్వే అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చాం. ఇటీవల డీఆర్యూసీసీ మీటింగ్లోనూ చెప్పాం. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా పనులు స్పీడప్ చేయాలి.
వై శ్రీనివాస్ రెడ్డి, డీఆర్యూసీసీ మెంబర్, కొత్తగూడెం