
న్యూఢిల్లీ: స్మార్ట్వర్క్స్ కోవర్కింగ్ స్పేసెస్ లిమిటెడ్ సోమవారం తన ఐపీఓ ప్రైస్ బ్యాండ్ను షేరుకి రూ.387–-407 గా నిర్ణయించింది. ఈ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 10 న ఓపెనై 14 న ముగుస్తుంది. జులై 9న యాంకర్ ఇన్వెస్టర్ల కోసం బిడ్డింగ్ ఓపెన్లో ఉంటుంది. ఈ ఐపీఓ ద్వారా రూ.583 కోట్లు సేకరించాలని కంపెనీ చూస్తోంది. గతంతో పోలిస్తే ఐపీఓ సైజును స్మార్ట్వర్క్స్ తగ్గించింది. ఫ్రెష్ షేర్ల ఇష్యూ సైజును రూ.550 కోట్ల నుంచి రూ.445 కోట్లకు, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) సైజ్ను 67.59 లక్షల షేర్ల నుంచి 33.79 లక్షల షేర్లకు తగ్గించింది. ప్రైస్ బ్యాండ్లో గరిష్ట ధర వద్ద కంపెనీ మార్కెట్ వాల్యూ రూ.4,645 కోట్లుగా ఉంది.
అధునాతన ఆఫీస్ స్పేస్లు, టెక్-ఎనేబుల్డ్ క్యాంపస్లను స్మార్ట్వర్క్స్ అందిస్తోంది. బెంగళూరు, ముంబై, హైదరాబాద్, గురుగ్రామ్, చెన్నైలో ఎక్కువగా విస్తరించింది. కంపెనీ 2022–23 నుంచి 2024–25 మధ్య ఏడాదికి 20.80శాతం వృద్ధి చెందింది. 28.3 లక్షల చదరపు అడుగుల స్పేస్ను తన పోర్టుఫోలియోకి జోడించింది. జేఎం ఫైనాన్షియల్, బీఓబీ క్యాపిటల్ వంటివి ఐపీఓ మేనేజర్లుగా పనిచేస్తున్నాయి. కంపెనీ షేర్లు జులై 17న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ అవుతాయి.