- ‘‘కంటెంట్ పబ్లిషర్’’గా మార్చి కొత్త రూల్స్
- పబ్లిష్ అయ్యే కంటెంట్ బాధ్యత కంపెనీలదే
- ఫేస్బుక్ విజిల్ బ్లోవర్తో సోషల్మీడియా కంపెనీలపై పెరిగిన దర్యాప్తు
బిజినెస్ డెస్క్, వెలుగు: గూగుల్, మెటా (ఫేస్బుక్), ట్విటర్ వంటి టెక్ కంపెనీలపై ఇండియాతో సహా గ్లోబల్గా స్క్రూటినీ పెరుగుతోంది. ఇప్పటి వరకు సోషల్ మీడియా ముసుగులో ఉన్న కంపెనీలను, పబ్లిషర్లుగా గుర్తించి రూల్స్ కఠినతరం చేయాలని భారత ప్రభుత్వం చూస్తోంది. ఆస్ట్రేలియా పార్లమెంట్ ఈ టెక్ కంపెనీల బిహేవియర్ను ఎంక్వైరీ చేయాలని నిర్ణయించుకుంది. ఫేస్బుక్, ట్విటర్, గూగుల్ ప్లాట్పామ్లలో ఫేక్ న్యూస్ బాగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఇతరులను హేట్ చేస్తూ పెడుతున్న పోస్టులు పెరుగుతున్నాయి. న్యూస్ మీడియా కాకపోవడంతో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై సరియైన చర్యలు తీసుకోలేకపోతున్నారు. ప్రభుత్వం త్వరలో తీసుకురాబోతున్న డేటా ప్రొటెక్షన్ చట్టంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను కంటెంట్ పబ్లిషర్లుగా గుర్తించనున్నారని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ‘సోషల్ మీడియా కంపెనీలు కంటెంట్ను పబ్లిష్ చేస్తాయి. ఈ కంటెంట్కు ఆయా కంపెనీలే బాధ్యత వహించాలి. యూజర్లకు హాని చేసే, వివక్ష చూపే కంటెంట్, ఫేక్ న్యూస్ పబ్లిష్ అవుతుంటే.. ‘అల్గారిథం’ వెనుక ఈ కంపెనీలు దాక్కోకూడదు’ అని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీశాఖల సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. మెటా ఎంప్లాయి ఫ్రాన్సెస్ హ్యూ బయటకొచ్చి కంపెనీపైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దేశంలో డమ్మీ యూజర్లు ఫేక్ న్యూస్, హేట్ స్పీచ్ను పోస్ట్ చేస్తున్నారని ఆమె ప్రకటించారు. ఈ విజిల్ బ్లోవర్ ఆరోపణలతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.
డెమొక్రసీని పెంచేలా ఉండాలి..
సోషల్ మీడియాలో పోస్టవుతున్న ఫేక్ న్యూస్ను కంట్రోల్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎలక్ట్రానిక్స్, ఐటీ మినిస్టర్ అశ్విన్ వైష్ణవ్ ప్రకటించారు. ఫేస్బుక్ విజిల్ బ్లోవర్ ఫ్రాన్సెస్ చేసిన ఆరోపణలను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఫేస్బుక్ విజిల్ బ్లోవర్ రిలీజ్ చేసిన ‘హాని చేసే నెట్వర్క్స్–ఇండియా కేస్ స్టడీ’ పై ప్రభుత్వం ఏ విధంగా స్పదింస్తోందనే ప్రశ్నకు ఆయన పై వ్యాఖ్యలు చేశారు. క్రిప్టో కరెన్సీ, సోషల్ మీడియా వంటి టెక్నాలజీను మార్చడానికి అన్ని దేశాలు కలిసి రావాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ప్రజస్వామ్యాలను మెరుగుపరిచేట్టుగా ఈ టెక్నాలజీలను మార్చాలని సమ్మిట్ ఫర్ డెమొక్రసీలో మీటింగ్లో మాట్లాడుతూ అన్నారు.
గ్లోబల్గా కఠినమవుతున్న రూల్స్..
గూగుల్, ఫేస్బుక్, ట్విటర్ల విధానాలపై చాలా దేశాల్లో దర్యాప్తులు జరుగుతున్నాయి. వీటి అల్గారిథమ్లు పారదర్శకంగా ఉండాలని, కంటెంట్ మోడరేషన్లో కొత్త పాలసీలు తీసుకురావాలని అంటున్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎటువంటి అల్గారిథమ్స్ ఉపయోగిస్తున్నాయి, ఏజ్ను ఎలా వెరిఫై చేస్తున్నాయి వంటి అంశాలపై దర్యాప్తు చేసేందుకు పాలసీలను తీసుకురావాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం చూస్తోంది..
మెటా, వాట్సాప్లో ‘ఐటీ కొత్త రూల్స్’ జాబ్స్..
నోడల్ కాంటాక్ట్, గ్రీవెన్స్ ఆఫీసర్ జాబ్స్ కోసం మెటా, వాట్సాప్లు క్యాండిడేట్లను వెతుకుతున్నాయి. అలానే చీఫ్ కంప్లియెన్స్ ఆఫీసర్ జాబ్ కోసం కూడా క్యాండిడేట్ను వెతుకుతున్నాయి. ఐటీ రూల్స్–2021 ప్రకారం, 50 లక్షల యూజర్లు దాటిన డిజిటల్ ప్లాట్ఫామ్స్ ప్రతీ నెల కంప్లియెన్స్ రిపోర్ట్లను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ రిపోర్ట్లో ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, ఎన్నింటిని పరిష్కరించారనే డిటెయిల్స్ను కూడా పొందుపరచాల్సి ఉంటుంది. కొత్త ఐటీ రూల్స్ ప్రకారం, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజంను చూసుకునేందుకు గ్రీవెన్స్ ఆఫీసర్ను, చీఫ్ కంప్లియెన్స్ ఆఫీసర్ను నియమించాల్సి ఉంటుంది. వీరు ఇండియాలోనే ఉండాల్సి ఉంటుంది. మెటా, వాట్సాప్లు ఈ పొజిషన్ కోసం సరియైన క్యాండిడేట్లను వెతుకుతున్నాయి. లింక్డిన్లో పోస్ట్ కూడా చేశాయి.