
కూకట్ పల్లి, వెలుగు: కేపీహెచ్బీ కాలనీ పోలీస్స్టేషన్ పరిధిలో పెండ్లయిన 2 నెలలకే ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్టకు చెందిన వడిగినేని చైతన్య(35), నాగమౌనిక(31)కు గత ఏప్రిల్ లో వివాహం జరిగింది. అప్పటినుంచి వారు కేపీహెచ్బీ కాలనీ ఏడో ఫేజ్ ఎల్ఐజీ 43లో నివసిస్తున్నారు. ఆషాఢమాసం కావడంతో మౌనిక గత నెల 21న పుట్టింటికి వెళ్లింది. చైతన్య ఒక్కడే ఇంట్లో ఉంటున్నాడు.
మౌనిక రోజూ భర్తతో ఫోన్లో మాట్లాడుతుండేది. సోమవారం రాత్రి 10 గంటలకు కూడా మాట్లాడింది. ఆ సమయంలో చైతన్య డల్గా మాట్లాడి, ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత 11 గంటల నుంచి మౌనిక పలుమార్లు ఫోన్ చేసినా అతను లిఫ్ట్ చేయలేదు. అనుమానం వచ్చి, ఆమె తన మామయ్యకు ఫోన్చేసి సమాచారం ఇచ్చింది. అతను వెళ్లి తలుపు కొట్టినా తియ్యకపోవడంతో పగులగొట్టి లోపలకు వెళ్లి చూశాడు. అప్పటికే చైతన్య ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్మార్చురీకి తరలించారు. చైతన్య జీవితంపై విరక్తితో సూసైడ్చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చామని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.