కరోనా సవాళ్లున్నాఎక్స్పోర్ట్లు బాగున్నాయ్ -ఎస్టీపీఐ డైరెక్టర్ జనరల్ ఓంకార్ రాయ్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా(ఎస్టీపీఐ) రిజిస్టర్డ్ యూనిట్ల సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్లు ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో రూ.2.49 లక్షల కోట్ల మార్క్ను తాకుతాయని అంచనాలున్నాయి. కరోనా సంబంధిత సవాళ్లు ఉన్నప్పటికీ, గత ఏడాది స్థాయికి ఈ ఏడాది సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్లు చేరుకుంటాయని ఎస్టీపీఐ ఉన్నతాధికారులు చెప్పారు. 2019–20లో ఎస్టీపీఐ రిజిస్టర్డ్ యూనిట్ల సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్లు రూ.4,47,750 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇవి 6 శాతం ఎక్కువ. ఎస్టీపీఐ తాజా డేటా ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో ఈ యూనిట్ల ఎక్స్పోర్ట్లు రూ.1.21 లక్షల కోట్లుగా ఉంటాయని అంచనాలున్నాయి. జూన్ క్వార్టర్లో ఈ ఎక్స్పోర్ట్లు రూ.1.27 లక్షల కోట్లుగా ఉన్నాయి. ‘ఎస్టీపీఐ రిజిస్టర్డ్ డేటా చాలా ప్రోత్సాహకరంగా ఉంది. లాక్డౌన్లో కూడా ఎక్స్పోర్ట్లు కొనసాగాయి. వర్క్ ఫ్రమ్ హోమ్, రిమోట్ వర్కింగ్తో వెనువెంటనే అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. 2020–21 ఫుల్ ఇయర్ ఎక్స్పోర్ట్ల ట్రెండ్, గత ఏడాది స్థాయిలకు చేరుకుంటుంది’ అని ఎస్టీపీఐ డైరెక్టర్ జనరల్ ఓంకార్ రాయ్ చెప్పారు.
ఎస్టీపీఐ అనేది ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన అటానమస్ సొసైటీ. ఇండియాలో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్లు పెంచేందుకు, ప్రమోట్ చేసేందుకు దీన్ని 1991లో ఏర్పాటు చేశారు. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్(ఎస్టీపీ), ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ టెక్నాలజీ పార్క్(ఈహెచ్టీపీ) స్కీమ్లతో ఎస్టీపీఐ దేశంలో ఎక్స్పోర్ట్లను పెంచుతోంది. సింగిల్ విండో క్లియరెన్స్ సర్వీసులను, ఇంక్యుబేషన్ ఫెసిలిటీస్ను, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసులను ఎస్టీపీఐ అందిస్తోంది. స్టార్టప్లకు అనుకూలమైన వాతావరణాన్ని రూపొందించడమే ఎస్టీపీఐ లక్ష్యంగా పనిచేస్తోంది. అంతేకాక ఎమర్జింగ్ టెక్నాలజీస్లో సెంటర్స్ ఆఫ్ ఎక్స్లెన్స్ల ఏర్పాటును, నెక్ట్స్ జనరేషన్ ఇంక్యుబేషన్ స్కీమ్ ఎగ్జిక్యూషన్లను ప్రోత్సహిస్తోంది. బ్యాంకింగ్ ఫైనాన్సియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్, హై–టెక్, మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో ఎక్స్పోర్ట్ల గ్రోత్ కొనసాగుతుందని ఓంకార్ రాయ్ పేర్కొన్నారు. లాక్డౌన్ కాలంలో కూడా ఇండియన్ టెక్ కంపెనీలు తమ సర్వీసులను అందించాయని, ఎస్టీపీఐ ఆఫీసులు పనిచేశాయని ఓంకార్ చెప్పారు.