హసన్పర్తి, వెలుగు: ఆస్తి కోసం జరిగిన గొడవలో క్షణికావేశంతో చిన్నమ్మ తల పగలగొట్టి హత్య చేసిన ఘటన వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి మండలం పెంబర్తిలో జరిగింది. ఎస్సై జితేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నూటెంటకి కనకయ్య రిటైర్డ్ సింగరేణి ఎంప్లాయ్. ఇతనికి ఇద్దరు భార్యలు ప్రమీల, విజయ. వీళ్లిద్దరూ సొంత అక్కా చెల్లెళ్లు కూడా. మొదటి భార్య ప్రమీలకు ఇద్దరు కొడుకులు వేణుగోపాల్, గౌరీశంకర్, ఒక కూతురు ఉన్నారు. రెండో భార్య విజయకు భాస్కర్ అనే కొడుకు ఉన్నాడు. నల్లబెల్లిలోని తన అమ్మగారి ఊర్లోని ఆస్తి అమ్మగా వచ్చిన మొత్తంలో తనకూ వాటా కావాలని వేణుగోపాల్ మంగళవారం రాత్రి చిన్నమ్మ విజయతో గొడవపడ్డాడు. కోపంలో రోకలిబండతో విజయ తలపై కొట్టాడు. ఒక్కసారిగా కుప్పకూలిపోయిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అక్కడే ఉన్న తల్లిదండ్రులు కనకయ్య, ప్రమీల గట్టిగా అరవడంతో వేణుగోపాల్ అక్కడి నుంచి పరారయ్యాడు. భాస్కర్ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పరకాలలో తల్లిని..
పరకాల, వెలుగు: తనతో లిక్కర్ మాన్పించేందుకు ఆయుర్వేద మందులు తినిపించిందనే అనుమానంతో తల్లిని దారుణంగా హత్య చేశాడో కొడుకు. అడ్డొచ్చిన తండ్రి, చెల్లిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన వరంగల్ రూరల్జిల్లా పరకాల టౌన్లో జరిగింది. ఏసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక వికాస్ నగర్ లో ఉండే తోర్నే రవి, పద్మ దంపతుల కొడుకు రమేశ్, కూతురు నీరజ. లిక్కర్కు బానిసైన రమేశ్ కొద్దిరోజులుగా ఆస్తి కోసం తల్లిదండ్రులతో గొడవపడుతున్నాడు. తనతో మద్యం మాన్పించేందుకు తల్లి ఆయుర్వేద మందులు తినిపించిందనే అనుమానంతో రమేశ్ ఈ నెల 3వ తేదీన కత్తితో తల్లిని పొడిచి చంపాడు. అడ్డొచ్చిన తండ్రి, చెల్లిపై కత్తితో దాడి చేయడంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. వాళ్లిద్దరూ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. రమేశ్ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరకాల ఇన్స్పెక్టర్మహేందర్రెడ్ది ఆధ్వర్యంలో గాలించి రమేశ్ను బుధవారం అదుపులోకి తీసుకున్నారు.