గత నెల ఏప్రిల్ 23వ తేదీ నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు చేస్తున్న ఆందోళనలు, నిరసనలపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మౌనం వీడారు. తనదైన స్టైల్లో స్పందించారు. ఏంజరుగుతుందో తనకు పూర్తిగా తెలియదని, సమస్య పరిష్కారమవుతుందని తాను ఆశిస్తున్నానని చెప్పారు.
"వాళ్ళు తమ యుద్ధంలో పోరాడనివ్వండి. అక్కడ ఏమి జరుగుతుందో నాకు తెలియదు, నేను వార్తాపత్రికలలో చదివాను. క్రీడా ప్రపంచంలో మీకు పూర్తి అవగాహన లేని విషయాల గురించి మీరు మాట్లాడరని నేను ఒక విషయం గ్రహించాను." అని గంగూలీ వ్యాఖ్యానించారు.
తమపై లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్సింగ్ను కఠినంగా శిక్షించాలని 12 రోజులుగా ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద రెజ్లర్లు ఆందోళన నిర్వహిస్తున్నారు. రెజ్లర్లు ఆందోళన చేస్తున్న దీక్షా స్థలి వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది. రెజ్లర్లు , వారికి మద్దతుగా వచ్చిన వారితో పోలీసులుతో వాగ్వాదానికి దిగడం.. చివరకు తోపులాట, ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో రాహుల్ యాదవ్, దుష్యంత్ ఫొగాట్ సహా పలువురు రెజ్లర్లకు తీవ్ర గాయాలయ్యాయి.
ధర్మేంద్ర అనే పోలీస్ అధికారి ఫుల్లుగా మద్యం తాగి వచ్చి.. తమ పట్ల అనుచితంగా ప్రవర్తించారని రెజ్లర్ వినేశ్ ఫొగట్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకేనా తాము ఎంతో కష్టపడి పతకాలు సాధించింది..? అని నిలదీశారు.